పారిపోలేదు: పత్రికల్లో ఆశారాం కుమారుడి యాడ్
సూరత్: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపు కుమారుడు నారాయణ సాయి స్థానిక వార్తా పత్రికకు అడ్వర్టయిజ్మెంట్ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో తనకు సంబంధం లేదని, తను అమాయకుడినని, ఎక్కడికీ పారిపోలేదని ప్రకటనలో పేర్కొన్నాడు. అంతేగాక కేసు విషయంలో న్యాయ సహాయాన్ని తీసుకోనున్నట్లు తెలిపాడు.
గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ఆశ్రమాలలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నారాయణ సాయికి పట్టణ పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. కాగా వార్తా పత్రికకు ఇచ్చిన ప్రకటనలో నారాయణ స్వామి ఎక్కడ ఉన్నాడన్న విషయంపై పేర్కొనకపోవడం గమనార్హం. తన కక్షిదారు నారాయణసాయి ఎక్కడికి పారిపోలేదని, వార్తా పత్రికలో తన ద్వారా ప్రకటనను చేయించారని నారాయణస్వామి తరపు న్యాయవాది గౌతమ్ దేశాయి తెలిపారు.
అవాస్తవ ఆరోపణల ఆధారంగా నారాయణసాయిపై ఎఫ్ఐఆర్ తయారు చేశారని, అతనికి ఏవిధంగానైనా న్యాయ సహాయం అందించాలనే వార్తా పత్రికలో ప్రకటన ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు సోదరీమణులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆశారాం బాపు, నారాయణసాయిలపై కేసు వేయడంతో పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. తమ నోటీసులో నారాయణ స్వామి వెంటనే తమ ముందు హాజరుకావాలని తెలియజేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
సూరత్ ఆశ్రమంలో ఉన్న తనపై 2002, 2005 సంవత్సరాల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయిపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అహ్మదాబాద్ సరిహద్దు ప్రాంతంలోని ఆశ్రమంలో ఉంటున్న తనపై 1997, 2006 సంవత్సరాల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మరో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఆరుగురు పోలీసుల ప్రత్యేక బృందాన్ని సూరత్ పోలీసులు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఆశ్రమం దగ్గర విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆశ్రమ పరిసరాల వీడియో చిత్రీకరణ చేపట్టారు.
కాగా మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆగస్టులో అరెస్టైన ఆశారాం బాపు జోధ్పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల బాధిత సోదరీమణులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, లైంగిక వేధింపులు, అక్రమ నిర్బంధం వంటి కేసులను ఆశారాం, అతని కుమారుడు నారాయణస్వామిలపై సూరత్ పోలీసులు కేసు నమోదు చేశారు.