Coronavirus: Ola షేర్ క్యాబ్ లు, ఆటోలు బంద్, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, దెబ్బకు !
న్యూఢిల్లీ/ బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తన ప్రతాపాన్ని ఉదృతం చేస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య శనివారం మద్యాహ్నంకు 271కి చేరింది. కరోనా వైరస్ దెబ్బకు భారతదేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి వ్యాపారాలు అక్కడే నిలిచిపోయాయి. కరోనా వైరస్ దెబ్బతో ప్రముఖ ఓలా క్యాబ్ సంస్థ తన సేవలకు బ్రేక్ వేసింది. దేశవ్యాప్తంగా ఓలా షేర్ క్యాబ్, మైక్రో, మిని, ప్రైమ్, ఆటో షేరింగ్ సర్వీసులు పూర్తిగా నిలిపి వేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
IASకొడుకుకి Coronavirus,లండన్ టూ భారత్ , మాల్స్ లో హల్ చల్, ఎంజాయ్, సీఎం ఫైర్!
రోజురోజుకీ కరోనా కేసులు పైపైకి
భారతదేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అంటూ ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
అలా జరుగుతుందనే భయం
ఓలా షేర్ క్యాబ్ లు, ఓలా షేర్ ఆటోల్లో ప్రతిరోజు ఎవరెవరో ప్రయాణిస్తుంటారు. ఓలా షేర్ క్యాబ్ లు, ఓలా షేర్ ఆటోల్లో ప్రయాణించే వారికి ముందుగా పరిచయాలు లేకపోవడం, కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారో తెలీకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విధమైన సమస్యలతో కరోనా వైరస్ వ్యాధి ఒకరి వలన మరి కొందరికి వ్యాపించే అవకాశం ఉందనే భయంతో ఓలా షేర్ క్యాబ్ లు, ఓలా షేర్ ఆటోల సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని ఆ సంస్థ నిర్వహకులు నిర్ణయించారు.
బెంగళూరు ప్రజలు కోసం
దేశవ్యాప్తంగా ఓలా షేర్ క్యాబ్ లు, ఓలా షేర్ ఆటోల సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని సంస్థ ప్రతినిధులు నిర్ణయించారు. ముఖ్యంగా కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు నగరంలో అధిక శాతం సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పోరేట్ సంస్థలకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. బెంగళూరు ప్రజలు కరోనా వైరస్ వ్యాధి బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఓలా షేర్ క్యాబ్ ల సేవలు నిలిపివేశారు.
సిటీల్లో జనసంచారం !
దేశ వ్యాప్తంగా ఐటీ సంస్థలు, కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, సినిమా థియేటర్స్, మల్టీఫ్లక్స్ లు పూర్తిగా మూసివేశారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో జనసంచారం అంతంతమాత్రంగానే ఉంది. ఎక్కడ కరోనా వైరస్ వ్యాధి తమకు అంటుకుంటుందో అనే భయం ప్రజల్లో రానురాను పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో షేర్ క్యాబ్ లు, షేర్ ఆటోల్లో ప్రయాణించే వారికి కరోనా వైరస్ వచ్చిందంటే మనకు ఎక్కడ మొదటికే మోసం వస్తుందో అనే భయంతో ఓలా క్యాబ్ నిర్వహకులు తమ సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారని తెలిసింది.