తీహార్ జైల్లో మరణమృదంగం: 8రోజుల్లో ఐదుగురు మృతి; మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
తీహార్ జైల్లో ఖైదీల మరణమృదంగం మోగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్ జైలులో గత ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మరణించటం సంచలనంగా మారింది. కరడుగట్టిన నేరగాళ్లకు కేంద్రంగా ఉన్న తీహార్ జైల్లో చోటు చేసుకుంటున్న మరణాలు ఢిల్లీ ప్రభుత్వాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. తాజాగా మరణాలకు సంబంధించిన విషయాన్ని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో తీహార్ జైల్ లో వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

తీహార్ జైల్లో ఖైదీల మరణాలు .. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
తీహార్ జైల్లో ఉన్న ఖైదీలు గత ఎనిమిది రోజుల్లో ఐదుగురు మృతి చెందడం పట్ల కొంతమేర అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అన్ని మరణాలు సహజ కారణాల వల్ల జరిగినట్లు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని అంటున్నారు. అయినప్పటికీ వరుసగా జైల్లో చోటుచేసుకున్న మరణాలపై సిఆర్ పి సి యొక్క సెక్షన్ 176 ప్రకారం మెజిస్టీరియల్ విచారణ ప్రారంభించబడిందని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఖైదీ మృతి ... అనారోగ్యం కారణంతో మృతి చెందాడన్న అధికారులు
ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం కూడా తీహార్ జైలు నంబర్ 3లో ఓ ఖైదీ మృతి చెందాడు. ఖైదీ తన సెల్లో అపస్మారక స్థితిలో ఉండడంతో గుర్తించిన జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఖైదీలు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అధికారి తెలిపారు. ఇతను చైన్ స్నాచింగ్ చేసి జైలుకు వచ్చినట్టు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగానే అతడు కూడా మరణించాడని జైలు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఖైదీని విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు.

ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.. మరణాలు సహజ మరణాలే అంటున్న జైలు అధికారులు
ఈ ఖైదీల మరణాలు వేర్వేరు బారెక్ లలో జరిగాయని, ఎవరికీ ఎలాంటి హింసతో సంబంధం లేదని, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని జైళ్ల డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ చెప్తున్నారు. ఇప్పటివరకు గత ఎనిమిది రోజుల్లో మృతిచెందిన వారి మరణాలకు వారికి ఉన్న పాత జబ్బులు, ఇతరత్రా కారణాలు ఉన్నాయని, కానీ అవన్నీ సహజ మరణాలను సూచిస్తున్నాయని సందీప్ గోయల్ చెప్పారు. వరుసగా చోటు చేసుకున్న జైలు మరణాలపై నిబంధనల ప్రకారం, ప్రతి కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విచారణ ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు.

చలి పెరగటం కూడా మరణాలకు కారణం కావచ్చన్న అధికారులు
ఢిల్లీలోని తీహార్ జైలు దేశంలోని సురక్షితమైన జైళ్లలో ఒకటి. ఇతర జైళ్లలో నివసిస్తున్న ఖైదీల కంటే ఇక్కడ నివసించే ఖైదీల భద్రత మరియు సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత 8 రోజుల్లో 5 మంది ఖైదీలు మృతి చెందడం కలకలం రేపింది. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, చలి పెరగడం కూడా జైల్లో ఖైదీల మరణాలకు కారణమని చెబుతున్నారు. ఇలాంటి మరణాల వల్ల అధికారులపై ఒత్తిడి పెరిగిందని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications