Delhi Gang Rape : 9 ఏళ్ల బాలికపై పూజారి,మరో ముగ్గురు గ్యాంగ్ రేప్, హత్య.. కేసులో కీలక పరిణామం
ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ నంగల్ 9 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్,హత్య కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు.వేగవంతమైన,శాస్త్రీయపరమైన విచారణ కోసం కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేసినట్లు ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. బాధిత బాలిక కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించిన కొద్దిసేపటికే ఈ కేసు బదిలీ జరిగింది.
దారుణం: 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల పూజారి,ముగ్గురు సిబ్బంది అత్యాచారం,హత్య...
ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం...
బాధిత బాలిక కుటుంబానికి అరవింద్ కేజ్రీవాల్ రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయిన లోటు ఎవరూ తీర్చలేనిదని పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్టిరియల్ విచారణకు ఆదేశించి ఉన్నత స్థాయి న్యాయవాదులను నియమిస్తామన్నారు. తద్వారా నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు. ఇలాంటి ఘటన అత్యంత సిగ్గుచేటు అని పేర్కొన్న కేజ్రీవాల్... నిందితులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాహుల్పై విమర్శలు... బాలల కమిషన్ నోటీసులు...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఎంతో సాయం అవసరమని... వారికి తాను అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చానన్నారు. అయితే బాధితురాలి ఫోటోను రాహుల్ ట్విట్టర్లో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బాలల హక్కుల కమిషన్ రాహుల్కు నోటీసులు జారీ చేసింది. రాహుల్ పోక్సో చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం బాధితురాలి ఐడెంటిటీని బహిర్గత చేయడం నేరం.మరోవైపు బీజేపీ రాహుల్పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనను రాహుల్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ గ్యాంగ్ రేప్లు జరుగుతున్నాయని... రాహుల్ అక్కడికి వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించట్లేదని ప్రశ్నించింది.
Recommended Video
ఆరోజు అసలేం జరిగింది...
ఓల్డ్ నంగల్ ప్రాంతంలోని ఓ శ్మశాన వాటికలో ఆదివారం ఈ గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. ఆ శ్మశాన వాటికకు ఎదురుగా ఉన్న ఓ అద్దె ఇంట్లో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ దంపతులకు చెందిన 9 ఏళ్ల చిన్నారి ఆదివారం(అగస్టు 1) సాయంత్రం సమయంలో ఆ శ్మశానానికి వెళ్లింది. ఫ్రిజ్ వాటర్ తాగేందుకు ఆ బాలిక అక్కడికి వెళ్లగా... రాధేశ్యామ్ అనే పూజారి,లక్ష్మీ నారాయణ,కుల్దీప్ యాదవ్,సలీమ్ అనే ముగ్గురితో కలిసి చిన్నారిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. అనంతరం బాలికను హత్య చేసి... విద్యుత్ షాక్తో చనిపోయినట్లుగా చిత్రీకరించాడని బాధిత బాలిక కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా ఆ పూజారి తమను అడ్డుకున్నాడని.. ఆధారాలు లేకుండా చేసేందుకు నిమిషాల వ్యవధిలోనే దహన సంస్కారాలు జరిపించాడని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి.