త్వరలో వాస్తవ రూపం దాల్చనున్న ఈ-పాస్పోర్టులు
న్యూఢిల్లీ : నకిలీ పాస్ పోర్టులకు చెక్ పెట్టడానికి త్వరలో ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ ఆచరణ రూపం దాల్చనుంది. త్వరలో రాబోయే ఈ-పాస్ పోర్టుల్లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఉండడంతో పాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఏడాది ఆరంభంలో పాస్ పోర్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ హై సెక్యూరిటీ పాస్ పోర్టులకు సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ మొదలవగా త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గత జులైలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేశారు. నకిలీ పాస్ పోర్టులకు చెక్ పెట్టేందుకు గాను.. కొత్తగా తీసుకొచ్చే ఈ-పాస్పోర్టుల్లో బయోమెట్రిక్ వివరాలను పొందుపరచనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్, నాసిక్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పాస్పోర్టులకు సంబంధించి టెండర్ ప్రక్రియతో పాటు ఎలక్ట్రానిక్ హార్ట్ వేర్ ను వీటిల్లో అమర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. పాస్పోర్టుకు సంబంధించిన పూర్తి వివరాలను చిప్ ద్వారా ఈ-పాస్ పోర్టుల్లో పొందుపరుస్తారు.
కాగా, ప్రస్తుతం పాస్పోర్టులను అత్యధికంగా జారీ చేస్తున్న దేశాల్లో చైనా అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లో 93 దేశాలు ఇప్పటికే ఈ పాస్ పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటి ద్వారా నకలి పాస్పోర్టులకు చెక్ పెట్టాలన్నదే ప్రధాన ధ్యేయం. గతంలో నకలీ పాస్పోర్టుల కేసులో మోనికా బేడితో పాటు గ్యాంగ్ స్టర్ అబూ సలెంను 2002లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.