కేజ్రీవాల్ కూడా రాజకీయం చేస్తున్నారా?: లైవ్లో అశుతోష్ కంటతడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ మృతి చెందిన అంశం తలచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ శుక్రవారం నాడు టీవీ ఛానల్ లైవ్లోనే కంటతడి పెట్టారు. ఉదయం ఆయన ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర కూతురుతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అశుతోష్... నేను చాలా మనస్తాపం చెందుతున్నానని, మీ తండ్రి ఆత్మహత్యను ఆపలేకపోయినందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. మీరు నన్ను క్షమిస్తారనే అనుకుంటున్నానని ఒక్కసారిగా కన్నీరు పెట్టారు.
తాను ఇలాంటి బ్లేమ్ గేమ్ కోసం రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తదితరులు ఈ హత్యను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటు ఏఏపీ నేత అశుతోష్ ఓ టీవీ ఛానల్ లైవ్లో గజేంద్ర సింగ్ కూతురుతో ఫోన్ లైన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టారు.
కాగా, గజేంద్ర సింగ్ ఆత్మహత్య సమయంలో అశుతోష్ విపరీత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ నేతలకు చెట్లు ఎక్కడం రాదని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెట్లు ఎక్కి కాపాడుతారని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
మరోవైపు, రైతు ఆత్మహత్య ఘటన పైన అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. కేజ్రీ క్షమాపణ పైన పలువురు భగ్గుమంటున్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటుండగా ప్రసంగించడం ఏమిటని నిప్పులు చెరుగుతున్నారు. ఏఏపీ కూడా రాజకీయం చేయడం నేర్చుకుందని విమర్శిస్తున్నారు.
గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకుంటుండగా తాను ప్రసంగం కొనసాగించడం పొరపాటేనని కేజ్రీవాల్ చెప్పారు. అదే సమయంలో పోలీసుల పైన నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కాగా, కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన తన కొడుకు తిరిగి వస్తాడా అని గజేంద్ర సింగ్ తండ్రి మండిపడ్డారు. ప్రసంగంపై పెట్టిన దృష్టి కేజ్రీ తన కుమారుడ్ని కాపాడటంపై పెట్టలేదని ఆరోపించారు.