సీడీఎస్ బిపిన్ రావత్ స్థానంలో కొత్తగా ఎవరు?: ముందు వరుసలో ఎంఎం నరవణె, భదౌరియా
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో తదుపరి త్రిదళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్)గా ఎవరు నియమితులవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, వాయుసేనల అధిపతులు ఇటీవల కాలంలోనే పదవులు చేపట్టినందున వారిలో సీనియర్ అయిన జనరల్ నరవణేకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్మీ చీఫ్గా జనరల్ రావత్ నుంచి ఆయన 2019 డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరించారు.
నేవీ అధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కేవలం ఎనిమిది రోజుల క్రితం, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
నరవణె సీడీఎస్ బాధ్యతలు చేపడితే, ఆర్మీ అధిపతిగా నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషీకి గానీ, ఆర్మ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ చండీ ప్రసాద్ మహంతిగానీ అవకాశాలున్నాయి. నేవీ, వాయుసేనల ప్రస్తుత చీఫ్ ల కన్నా లెఫ్టినెంట్ జనరల్ జోషీయే సీనియర్ కావడం గమనార్హం..
అయితే, ఎయిర్ చీఫ్ మార్షల్గా రిటైరైన భదౌరియా కు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
జనవరి 1, 2020లో బిపిన్ రావత్ భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా నియమితులయ్యారు. అయితే, రావత్ కుటుంబం ఎన్నో తరాలు భారత సైన్యంలోనే పనిచేస్తున్నాయి.