వారిని దెయ్యాలే చంపాయ్: హోంమంత్రి షాకింగ్ కామెంట్స్
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ తన వాఖ్యలతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు. రాష్ట్రంలో నమోదవుతోన్న మరణాలపై అధికారంలో భారతీయ జనతా పార్టీని సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది.
అయితే, దానిపై స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్రసింగ్.. మధ్యప్రదేశ్లో గత రెండున్నరేళ్లలో 400 మంది మృతి చెందారని, వారిలో కొందరిని దెయ్యాలు చంపాయని ఆయన అధికారికంగా ప్రకటన చేశారు.
ఒక హోంమంత్రి ఈ ప్రకటన చేయడంతో విన్న వారికి దిమ్మదిరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ స్పందిస్తూ.. హోం మంత్రి ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. కొందరి చావులకి కారణం చేతబడి, దెయ్యాలే కారణమని సాక్షాత్తు హోంమంత్రే ప్రకటన చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.
హోం మంత్రి ఈ ప్రకటన చేసిన తర్వాత తాము ప్రభుత్వం మూఢనమ్మకాలను విశ్వసిస్తుందా? అని ప్రశ్నించామని, దీనికి మంత్రి నుంచి సమాధానం రాలేదని ఆయన చెప్పారు.
ఈ ప్రకటన చేసిన అనంతరం భూపేంద్రసింగ్ శాసనసభ బయట మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబసభ్యులు దెయ్యాల వల్లే చనిపోయారని చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులు చెప్పారని తెలిపారు. అదే విషయాన్ని తాము ప్రకటించామని బదులిచ్చారు. అయితే తమ ప్రభుత్వం ఇటువంటి వాటిని విశ్వసించబోదని ఆయన అన్నారు.