హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధం-జూన్ 2న ముహుర్తం-గుజరాత్ బీజేపీకి ఊపు
గుజరాత్ కాంగ్రెస్ తో విభేదించి ఈ మధ్యే రాజీనామా సమర్పించిన పటీదార్ నేత హార్ధిక్ పటేల్ భవిష్యత్ వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీలో చేరేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. వచ్చేనెల 2న హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరే అవకాశముంది.
పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమాలతో తెరపైకి వచ్చిన హార్దిక్ పటేల్ తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హార్ధిక్ సాయంతో కాంగ్రెస్ పటీదార్లను ఆకట్టుకుంది. అయితే అధికారానికి మాత్రం దూరంగా ఉండిపోయింది. దీంతోపాటే పార్టీలో లుకలుకలు కూడా మొదలయ్యాయి. ఇవి చివరికి హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కారణమయ్యాయి. కాంగ్రెస్ ను వీడిన తర్వాత రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్న హార్ధిక్ జూన్ 2న బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయనను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో హార్ధిక్ బీజేపీలో చేరబోతున్నారు.
28 ఏళ్ల ఈ పటీదార్ నేత తనతో పాటు ఇతర యువ నాయకులను విస్మరించారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అభియోగాలు మోపుతూ నెల రోజులుకు పైగా అసంతృప్తితో గడిపిన తర్వాత మే 18 న కాంగ్రెస్కు రాజీనామా చేశారు.కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత ఈ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ బిజెపి "నిర్ణయాత్మక" నాయకత్వాన్ని విపరీతంగా ప్రశంసిస్తూనే ... కాంగ్రెస్ నాయకత్వాన్ని "అత్యంత మతతత్వ, హిందూ వ్యతిరేక, గుజరాతీ వ్యతిరేకమైనదిగా ఆరోపిస్తున్నారు. కాషాయ పార్టీలో చేరిక తర్వాత హార్ధిక్ పటేల్.. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
ఆయన బీజేపీలో చేరడం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి పెద్ద ఊపునిచ్చే అవకాశం ఉంది. 2017లో, విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనకు నాయకత్వం వహించిన తర్వాత, బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్య వారిలో పటేల్ కూడా ఒకరు.