టెక్కీలకు శుభవార్త:హెచ్ 1 బీ వీసాలపై అమెరికాతో మోడీ చర్చలు, ట్రంప్ సానుకూలమే?
నైపుణ్యం గల వృత్తి నిపుణుల పట్ల ఆచి, తూచి దూరదృష్టితో వ్యవహరించాలని అమెరికా ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం సుసంపన్నం కావడంలో భారతదేశ ప్రతిభావంతులు నిర్వ
న్యూఢిల్లీ:నైపుణ్యం గల వృత్తి నిపుణుల పట్ల ఆచి, తూచి దూరదృష్టితో వ్యవహరించాలని అమెరికాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం సుసంపన్నం కావడంలో భారతదేశ ప్రతిభావంతులు నిర్వహిస్తున్న పాత్రను గుర్తు చేశారు.
హెచ్ 1 బీ వీసాలను కుదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం చర్యలు చేపడుతున్న తరుణంలో మోడీ ఆ దేశ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు.హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే భారత దేశంపై చెప్పుకోదగిన ప్రభావం పడుతోందన్న ఆందోళన లేకపోలేదు.
26 మంది సభ్యులతో కూడిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం నాడు న్యూఢిల్లీ వచ్చింది. ఈ బృందంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్ ,పరిపాలన మారిన నేపథ్యంలో ఈ బృందం భారత్ లో పర్యటించడం ద్వైపాక్షిక సహకారానికి శుభారంభ సూచికమని చెప్పారు.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తన సంభాషణ సానుకూలంగా జరిగిందని ఆయన గుర్తుచేసుకొన్నారు.గత రెండున్నర ఏళ్ళలో బలపడిన సంబంధాలను మరింత పటిష్టపర్చేందుకు ఇరు దేశాలు అంకిత భావం ప్రదర్శిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో ప్రధానమంత్రి చర్చల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది.