రూ.200 నోట్లు ఎటిఎంలలో రావాలంటే మరో 3 నెలలు
న్యూఢిల్లీ:ఎటిఎం నుండి రూ.200 కొత్త నోటు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకా మూడు మాసాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేసిన తర్వాతే రూ. 200 నోట్లను ఎటిఎంలలో ఉంచనున్నారు.
ఆర్బిఐ ఇటీవలనే కొత్తగా రూ.200 నోటును విడుదల చేసింది. కొత్త నోట్ల జారీకి అనుగుణంగా మెషీన్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేశాయి.
అయితే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయని మిషన్లను వెంటనే చేయాలని బ్యాంకులు ఆయా సంస్థలను కోరాయి. మరోవైపు రూ.200 నోట్ల సరఫరాను త్వరలో పెంచనున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఎప్పటి నుండి రూ.200 నోట్లను ఎక్కువగా సరఫరాచేస్తారోననే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
కొత్త నోటు జారీకి తగినట్టుగా దేశ వ్యాప్తంగా 2.25 లక్షల ఎటీఎంల్లో మార్పులుచేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బిఐ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయనున్నట్టు ఎటిఎం నిర్వాహకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 60వేల ఎటిఎంలను నిర్వహిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండి రవి చెప్పారు.