శాసనసభా పక్ష నేతగా నితీష్: పార్టీ నుంచి మాంఝీ బహిష్కరణ
పాట్నా: బీహార్ రాజకీయాల్లో శనివారం నాడు నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తిరుగుబాటు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝీని జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నుంచి బహిష్కరించింది. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను శాసనసభా పక్ష నేతగా శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో శాసనసభను రద్దు చేయాలని శనివారం అంతకు ముందు మంఝీ గవర్నర్కు సిఫార్సు చేశారు. శానససభ రద్దు ప్రతిపాదనను ముఖ్యమంత్రి మంత్రివర్గం ముందు ఉంచారని, అయితే ఏడుగురు మంత్రులు మాత్రమే దానికి మద్దతు తెలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బిజేంద్ర యాదవ్ చెప్పారు. నితీష్ కుమార్ అనుకూల మంత్రులు 27 మంది వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
శనివారం సాయంత్రం జరిగిన జెడి(యు) శాసనసభ్యుల సమావేశంలో నితీష్ కుమార్ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి 97 మంది శాసనసభ్యులు, 20 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నితీష్ కుమార్కు మద్దతు ఇస్తున్నట్లు మంత్రులు ఫాక్స్ ద్వారా రాష్ట్రపతికి, గవర్నర్కు తెలిపారు.
కాగా, శాసనసభ రద్దుకు మంఝీ చేసిన సిఫార్సును అంగీకరించవద్దని జెడి (యు) నేత పికె షాహీ రాష్ట్రపతిని, గవర్నర్ను కోరారు. నితీష్ కుమార్ ఎలాగైనా అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. బీహార్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత జెడియుకు ఉందని, కానీ ఆ పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల ఏమైనా జరగవచ్చునని కాంగ్రెసు నేత పిసి చాకో అన్నారు.