ఆర్టికల్ 370 రద్దు అనాలోచిత నిర్ణయం : జీవన్ రెడ్డి విసుర్లు
హైదరాబాద్/జగిత్యాల : ఆర్టికల్ 370 రద్దు చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ ఆమోదం పొందడంతో .. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. అధికార బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు జీవన్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వం ఆలోచించి చేసిన నిర్ణయాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. దీంతో పరిణామాలు ఎలా మారుతాయోనని భయాందోళన వ్యక్తం చేశారు.
సరికాదు
అందాల కశ్మీర్ భారతదేశ గుండెకాయ. అందుకోసమే ఆర్టికల్ 370తో ప్రత్యేక ప్రతిపత్తిని ఆనాడు నెహ్రూ ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు జీవన్ రెడ్డి. కానీ ఆనాడు ఆలోచించి చేసిన చర్యలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. కశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను కాలారాసిందని మండిపడ్డారు. ఆర్టికల్ 370, 35ఏ రాజ్యాంగంలో పొందుపరిస్తే .. ఏకపక్షంగా తీసేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. భారత భూభాగంలో అంతర్భాగంగా కొనసాగించడానికి అప్పుడు ప్రత్యేక హక్కులను కల్పించారని గుర్తుచేశారాయన. కానీ బీజేపీ అధికార దాహంతో దానిని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. రాజ్యసభలో బలం ఉంది కదా అని ఏకపక్షంగా ముందుకెళ్లిందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆందోళనను పట్టించుకోకుండా ఆర్టికల్ 370 రద్దుచేయడం సరికాదన్నారు. దీంతో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థం కావడం లేదన్నారు.

ఇలా ఆమోదం
జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని ఇవాళ ఉదయం కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. తర్వాత 4 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ చేపట్టి .. ఆమోదించారు. మూజువాణి ఓటుతో కాకుండా డివిజ్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింపజేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు భావించగా .. డివిజన్ పద్ధతిలో ఓటింగుకు సభ్యులు పట్టుబట్టారు. మధ్యలో కొద్దిసేపు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో స్లిప్పుల ద్వారా ఓట్లను లెక్కించారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో 191 మంది సభ్యులు ఉన్నారు. కశ్మీర్ విభజన బిల్లుకు 125 మంది మద్దతు తెలిపారు. ఎన్డీఏ సహా మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. అయితే సభలో ఉన్న మరో సభ్యుడు ఎవరికీ ఓటేయక .. తటస్థంగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications