ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్వేల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరో మారు మోడీ సర్కార్ కే జనం పట్టం కట్టారని చెప్తున్నాయి. అయితే దీనిపై మాత్రం కాంగ్రెస్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కి 28, బీజేపీకి 11 లోక్ సభ స్థానాలు .. పుంజుకున్న బీజేపీ .. టైమ్స్ నౌ సర్వే
ఎగ్జిట్ పోల్స్ పై మండిపడిన మమతా బెనర్జీ ..
ఎగ్జిట్ పోల్స్ సర్వేల మీద పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న మమతా బెనర్జీ ఈసారి ఎలాగైనా మోడీ సర్కార్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా హోరాహోరీగా పోరాడారు. పలు ఉద్రిక్తతలు, ఆందోళనల నడుమ సాగిన ఎన్నికల్లో మమత మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. ఇంతా చేశాక వెలువడ్డ ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం అన్ని సంస్థలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పక్షం 300 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మనని తేల్చిచెప్పారు.
అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి .. మమతకు ఆగ్రహం తెప్పించిన ఎగ్జిట్ పోల్స్
మోడీ సర్కార్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వుందని , అది కచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతుందని భావిస్తే ఆ అంచనాలన్నీ తారుమారు చేసి మరీ కమల దళ వికాశం చూపిస్తుందని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్ . ఇక ఈ సారి కూడా కాంగ్రెస్ పెద్దగా తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని తేల్చాయి. ఇక ఈ దఫా ఎన్నికల్లో సత్తా చాటుతామని భావించిన కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ దఫా హంగ్ ముచ్చటే లేదని మరోమారు బీజేపీ సత్తా చాటుతుందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మమతకు ఆగ్రహం తెప్పించాయి.
ఈవీఎంలపై కుట్ర మొదలైందా అంటూ మమత సంచలన వ్యాఖ్యలు
ఎగ్జిట్ పోల్స్ వార్తలను బాగా వ్యాప్తిలోకి తెచ్చి ఆ తర్వాత ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుందని మమతాబెనర్జీ మండిపడ్డారు . అదే సమయంలో వేలాది ఈవీఎంలను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే కుట్రలు జరిగే అవకాశం ఉందన్నారు.ఎగ్జిట్ పోల్స్ ఒక గాసిప్ అని ఆమె నమ్మనని తేల్చేశారు. అంతే కాదు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, తద్వారా మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు . ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న మమతాబెనర్జీ విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా, బలంగా ఉండాలని కోరారు. వెస్ట్ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.