మీటూ.: కేంద్రమంత్రి ఎంజే అక్బర్పై ప్రియారమణి ఆరోపణ, ‘సుష్మాజీ స్పందించరా?’
న్యూఢిల్లీ: మీటూ ఉద్యమంతో అనేక వేధింపుల విషయంలో బహిర్గతమవుతున్నాయి. తాజాగా, కేంద్రమంత్రి, మాజీ సంపాదకుడు ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో చేరారు. ప్రియారమణి అనే పాత్రికేయురాలు మీటూ ఉద్యమం ద్వారా తాను అనుభవించిన వేధింపులను బయపెట్టారు.
అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విదేశాంగ మంత్రి మంత్రి సుష్మా స్వరాజ్ను ప్రశ్నించగా, ఇంతవరకు ఆమె స్పందించలేదు. ప్రముఖ పాత్రికేయుడైన ఎంజే అక్బర్.. ప్రస్తుతం విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు. యూఎస్లో మీటూ ఉద్యమంతో హార్వే వీన్స్టీన్ ఉదంతాలు వెలుగులోకి వచ్చిన సమయంలోనే ప్రియారమణి కూడా ఆమెపై జరిగిన వేధింపులను మొదట బయటపెట్టారు. కానీ అప్పుడు ఆమె అతడి పేరు బయటపెట్టలేదు.
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తన డిప్యూటీ మంత్రిపై ఎలాంటిచర్యలు తీసుకుంటారని ప్రశ్నలు మొదలయ్యాయి. 'అవి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు. మీరు మహిళా కేంద్ర మంత్రి. ఈ ఆరోపణల మీద విచారణ నిర్వహిస్తారా?' అని మరో పాత్రికేయురాలు స్మితా శర్మ ప్రశ్నించారు. అయితే దీనిపై మంత్రి స్పందించలేదు.
రమణి చేసిన ఆరోపణలకు అనేక మంది స్పందించారు. వారి బాధలను కూడా బయటపెట్టారు. గత సంవత్సరం అక్టోబరులో రమణి.. ఎడిటర్ అని సంబోధిస్తూ వోగ్ ఇండియాలో ఒక కథనాన్ని రాశారు. దాంట్లో ఆమె 'డియర్ మేల్ బాస్' అని ఉద్దేశిస్తూ దానిలో ఆరోపణలు చేశారు. అక్బర్ ఆమెను ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ముంబైలోని ఒక హోటల్కు ఆహ్వానించి, గదిలోకి పిలిచి తాగడానికి ఒక డ్రింక్ ఇచ్చాడని వెల్లడించింది. అంతటితో ఆగకుండా చాలా దగ్గరగా కూర్చొమన్నాడని ఆమె తెలిపింది. ఎలాగో అలా ఆ రాత్రి అక్బర్ నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ఆ కథనానికి ఆమె 'టు ది హార్వే వీన్స్టీన్ ఆఫ్ ది వరల్డ్' అని పేరుపెట్టారు.
తనతో 17 ఏళ్ల కిందట అక్బర్ ఇలాగే ప్రవర్తించారని, అయితే తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ప్రేరణ సింగ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు. అక్బర్ ప్రస్తుతం నైజిరియాలో ఉండటంతో, ఆయన ఈ ఆరోపణలపై స్పందించలేదు.