ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు చనిపోయినట్లు సమాచారం రాలేదన్న కేంద్రం, మండిపడుతున్న నెటిజన్లు
''నేను ఈ పోస్ట్ను తొలగిస్తున్నాను. ఎవరి కోసం ఆక్సిజన్ సిలిండర్ అవసరమని చెప్పానో వారు ఇప్పుడు జీవించి లేరు''
''ఆక్సిజన్ సిలిండర్ అర్జెంట్గా కావాలి. రోగి పరిస్థితి విషమంగా ఉంది''
''ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్స్ దొరడం లేదు. ఎవరైనా సహాయం చేయండి''
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో సోషల్ మీడియాలో ఇలాంటి అనేక పోస్టులు లేదా ట్వీట్లను మనలో చాలామంది చూసి ఉంటారు.
తమ బంధువులు, స్నేహితులను రక్షించుకోవడానికి అనేకమంది ఆక్సిజన్ సిలిండర్ కోసం పరుగులు పెడుతున్న దృశ్యాలను కూడా మీలో చాలామంది చూసే ఉంటారు.
ఇప్పుడు, ఈ సందేశాలు, దృశ్యాలు, అనుభవాలు నిజం కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.
''ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోయినట్లు తమకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు'' అన్నది ఈ ప్రకటన సారాంశం.
ఈ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం నిజాలు దాస్తోందని విమర్శిస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ లేక చనిపోతున్నారు... ఎవరు దీనికి బాధ్యులు?
- ఆక్సిజన్ దొరికితేనే ఆయువు.. దిల్లీ ప్రజల నిస్సహాయ స్థితి
ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు రోడ్డు మీద, ఆసుపత్రులలో మరణించారన్నది నిజమా కాదా అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
''మరణాల నివేదికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేసులు, మరణాల గురించి రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపాయి. అయితే, వాటిలో ఎక్కడా ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించలేదు'' అని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం నిజాలను దాస్తోందన్న విమర్శలకు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు.
''గణాంకాలను దాచాల్సిన అవసరం లేదు. కేసులు, మరణాల రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? గణాంకాలను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రాలు చేస్తాయి'' అని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
''కొంతమంది సభ్యులు ప్రభుత్వం గణాంకాలను దాచి పెడుతోందని అంటున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు పంపే సమాచారాన్ని ఒక చోట చేర్చి కేంద్ర ప్రభుత్వం ప్రచురిస్తుంది. ఈ నివేదికను ప్రచురించడం తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన జోక్యం ఉండదు'' అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రకటనపై స్పందనలు
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అనేకమంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
https://twitter.com/RahulGandhi/status/1417497251698597890
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ట్వీట్ చేశారు.
''ఆక్సిజన్ కొరత మాత్రమే కాదు. సెన్సిటివిటీ, వాస్తవాల కొరత నేటికీ ఉంది'' అని అందులో పేర్కొన్నారు.
https://twitter.com/_sabanaqvi/status/1417525712454524930
''ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరూ మరణించలేదు. కరోనా రెండవ వేవ్ కూడా రాలేదు. అసలు కోవిడ్-19 ఉందా?'' అని జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ ట్వీట్ చేశారు.
https://twitter.com/rasheedkidwai/status/1417500490837889024
''ఆక్సిజన్ కోసం జనం పగలు రాత్రి అన్న తేడా లేకుండా పరుగులు పెట్టారు. అనేకమందికి ఫోన్లు చేశారు. అదో భయంకరమైన కాలం. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని చెబుతోంది'' అని కాంగ్రెస్ నేత హసీబా ట్వీట్ చేశారు.
''మేమంతా ఆక్సిజన్ కోసం చాలా ఆరాటపడ్డాం. ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణాలు సంభవించలేదని ప్రభుత్వం చేసిన ప్రకటన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రజలను అవమానించడమే'' అని మరో జర్నలిస్ట్ సాబా నఖ్వీ అన్నారు.
''అధికారులు చెప్పిన దానిని బట్టి ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు తప్ప ఆక్సిజన్ దొరక్క ఎవరూ మరణించ లేదు'' అని టీఎంసీ నేత మహువా మోయిత్రా ఎద్దేవా చేశారు.
https://twitter.com/MahuaMoitra/status/1417534082829807616
ప్రభుత్వానికి మద్ధతుగా...
అయితే, ప్రభుత్వ ప్రకటనను సమర్థిస్తున్న వారు కూడా చాలామందే ఉన్నారు.
''ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎంత మంది మరణించారో దిల్లీ ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు చెప్పలేదు'' అని నవీన్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
''మొత్తం వార్తను చదవండి. రాష్ట్రాలు తమకు సమాచారం ఇవ్వలేదని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది'' అని సురేంద్ర దక్ష ప్రజాపతి అనే యూజర్ రాశారు.
''మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో ఆక్సిజన్ లేక ఎవరూ మరణించ లేదని నివేదికల్లో చెబుతారు. కానీ, మనం మాత్రం మోదీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని అంటాం'' అని మరో యూజర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ జిల్లాలో 25 గ్రామాల ప్రజలు వారంవారం ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటారు.. కారణం ఇదీ
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్ను ఎలా హ్యాక్ చేస్తుంది
- 'ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు ఇంటికొచ్చి బెదిరించారు’
- సిరియా: 'ఇస్లామిక్ స్టేట్’కి పనిచేసిన బ్రిటిష్ యువకుడి స్మార్ట్ఫోన్లో ఏముంది
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాలపై రివర్ బోర్డులకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుంది?
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)