రైతు సంఘాలకు NHRC షాక్-ఢిల్లీ, హర్యానా, రాజస్దాన్, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది రైతులు చేపట్టిన ఆందోళనల వల్ల పారిశ్రామిక యూనిట్లపై పడిన ప్రతికూల ప్రభావంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో రైతుల్ని అడ్డుకోవడంలో విఫలమైన నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన కారణంగా పారిశ్రామిక యూనిట్లు మరియు రవాణా ప్రభావితమవుతున్న ఫిర్యాదులపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇావాళ తెలిపింది.
రైతులు చేపట్టిన నిరసనల వల్ల ఇబ్బందుల పాలైనట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఆందోళనల కారణంగా సుమారు 9,000 పారిశ్రామిక యూనిట్లు, రవాణా వ్యవస్ధ ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని నోటీసుల్లో ఎన్ హెచ్ ఆర్సీ పేర్కొంది. రైతు ఆందోలనలతో రవాణా తీవ్రంగా ప్రభావితమైందని, దీనివల్ల ప్రయాణికులు, రోగులు, శారీరక వికలాంగులు, వృద్ధులు రోడ్లపై భారీగా రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, కానీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారని నివేదికలు ఇన్నట్లు కమిషన్ పేర్కొంది.
ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ, రాజస్తాన్, యూపీ, హర్యానా, నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు బాస్ లకు ఈ నోటీసులు జారీ చేసింది, రైతు ఆందోళనలు అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలపై వీరి నుంచి నివేదికలు కోరింది. నిరసనలు చేపట్టిన స్థలంలో ఆందోళన చేస్తున్న రైతులు కోవిడ్ -19 ప్రోటోకాల్లను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కమిషన్ తెలిపింది. రోడ్లను దిగ్బంధించడం వల్ల నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నట్లు తెలిపింది. ఆందోళనలో మానవ హక్కుల సమస్య ఉన్నందున, శాంతియుతంగా ఆందోళన చేసే హక్కును కూడా గౌరవించాలని కమిషన్ వెల్లడించింది. కమిషన్ వివిధ మానవ హక్కుల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Recommended Video
ఇవాళ నాలుగు రాష్ట్రాలకు జారీ చేసిన నోటీసుల్లో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా, వినియోగదారులపై రైతుల నిరసన యొక్క ప్రతికూల ప్రభావాన్ని అధ్యయనం చేసి అక్టోబర్ 10 లోపు నివేదిక సమర్పించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ని కూడా కోరినట్లు కమిషన్ తెలిపింది. నిరసన ప్రదేశాలలో కరోనా నిబంధనల అమలుపైనా ప్రతికూల ప్రభావంపై జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి కూడా నివేదికలు కోరినట్లు NHRC తెలిపింది. నిరసన స్థలంలో లైంగిక వేధింపులకు గురైన కార్యకర్త కుటుంబానికి పరిహారం చెల్లింపుపై అక్టోబర్ 10 లోపు నివేదిక సమర్పించాలని కమిషన్.. జిల్లా మేజిస్ట్రేట్ను కోరింది. ఆందోళన కారణంగా వృధ్దులు, రోగుల జీవనోపాధికి అంతరాయం, దాని ప్రభావంపై సర్వే చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ని కోరింది.