ముహుర్తం ఖరారు: 20న పాట్నాలో నితీశ్ ప్రమాణం
పాట్నా: ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో వేడుకగా జరగనున్న ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలను పెద్ద సంఖ్యలో ఆహ్వానించనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతానని చెప్పిన సంగతి తెలిసిందే.
మహాకూటమిలో అత్యధిక సీట్లను గెలుచుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి షాకిచ్చి మహాకూటమి ఘన విజయం సాధించింది.
మహాకూటమిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో నితీశ్ సారధ్యంలోని మహాకూటమి 178 స్ధానాల్లో విజయం సాధించగా, ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది.
14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. మరో 7 స్ధానాల్లో ఇతరులు విజయం సాధించారు. మహా కూటమిలోని ప్రధాన పార్టీ జేడీయూ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.