రామ్నాథ్ కోవింద్కే ఓటు: లాలూ-సోనియాలకు నితీష్ షాక్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కు మద్దతి ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపినా ఆ పార్టీకి మద్దతు లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలకు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కు మద్దతి ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపినా ఆ పార్టీకి మద్దతు లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారని తెలుస్తోంది.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్నాథ్: ఎవరీ కోవింద్?
సోనియా, లాలూలకు చెప్పిన నితీష్
రామ్ నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్గా ఉన్నారు. ఆయనను ఎంపిక చేయడం పట్ల నితీష్ ఇదివరకే హర్షం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షాలతో కలవకుండా ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే మద్దతివ్వాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్కు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి అభ్యర్థికే
తమ పార్టీ కోవింద్కే మద్దతించేందుకు నిర్ణయం తీసుకుందని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా తర్జనభర్జన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ సహా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. అధికార పక్షం నిలబెట్టే అభ్యర్థి పేరు ప్రకటించాకే తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి. ఈ నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ను ఎన్డీయే సోమవారం ప్రకటించింది. దీంతో విపక్షాలన్నీ ఎన్నికలు జరగాల్సిందేనని స్పష్టం చేశాయి. తమ పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించాయి.
ఎన్డీయేకే మద్దతు
అయితే రామ్నాథ్ పేరును ప్రకటించిన కొద్ది గంటలకే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయన్ని స్వయంగా కలిసి అభినందించారు.దీంతో నితీశ్ మద్దతు అధికార పక్షానికా, ప్రతిపక్షానికా అన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకునే విషయమై నితీశ్.. బుధవారం జేడీయూ నేతలతో సమావేశమయ్యారు. ఎన్డీయేకే మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
మోడీ - నితీష్ మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు
గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ, నితీశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బీహార్లో మద్యనిషేధాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ప్రధాని.. ఆయన్ని అభినందించారు. ఇటీవల కేంద్రంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలకు నితీశ్ బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలోనే నితీశ్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
భేదాభిప్రాయాలు..
ఇదిలా ఉండగా, లాలూ.. నితీశ్ మధ్య మళ్లీ భేదాభిప్రాయాలు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ మధ్య ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నితీశ్ మద్దతు తెలిపారు. అయితే లాలూ మాత్రం విమర్శలు చేశారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ వీరిద్దరి మధ్యా మళ్లీ ఇదే తీరు కన్పించబోతున్నట్లు తెలుస్తోంది. నితీష్.. రామ్ నాథ్ కోవింద్కు మద్దతిచ్చేలా ఉన్నారు. లాలూ మాత్రం నితీశ్ తీరుపై సుముఖంగా లేరని అంటున్నారు.
లాలు కొడుకులపై అవినీతి ఆరోపణలు
ఇటీవల లాలూ కుమారులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్రంపై అసహనంగా ఉన్న లాలూ.. ఎన్డీయే అభ్యర్థికి ఎంతమాత్రం మద్దతు తెలపబోరని అంటున్నారు. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నితీశ్, లాలూలు చెరో దారిలో పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది.