విలువ లేదా: పాత నోట్ల మార్పిడికి ఢోకా లేదా...
న్యూఢిల్లీ: చట్టబద్దమైన డబ్బులకు ఏ విధమైన ఇబ్బంది లేదని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. పాత ఐదు వందలు, వేయి రూపాయల నోట్లకు విలువ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, వాటికి విలువ ఉంటుంది. కానీ అవి చెలామణిలో ఉండవు. దాచి పెట్టిన నోట్లకు, అంటే లెక్క చూపని నోట్లకు మాత్రమే విలువ ఉండని పరిస్థితి ఏర్పడింది.
ఏవైసి నిబంధనలను పాటిస్తే బ్యాంకుల్లో ఎంత డబ్బునైనా జమ చేయవచ్చు. ఆ నిబంధనలను పాటించలేని పరిస్థితి ఉంటేనే కష్టం. డబ్బుల మార్పిడికి పోస్టాఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఫారాలు ఉంటాయి. వాటిలో పూర్తి వివరాలు నింపాలి. ఓ గుర్తింపు కార్డు కూడా వెంట ఉండాలి. ఆ నిబంధనలను పాటిస్తే పాత ఐదు వందల నోట్లకు, వేయి రూపాయల నోట్లకు సమానమైన విలువ గల ఇతర నోట్లను ఇస్తారు.
ఏవైసి నిబంధనలను పాటించకుండా 50 వేల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అంతకు మించి డిపాజిట్ చేయాలంటే ఏవైసి నిబంధనలు పాటించాల్సిందే. వ్యక్తులే స్వయంగా పోస్టాఫీసులకో, బ్యాంకులకో వెళ్లాల్సిన అవసరం లేదు. తమ ప్రతినిధులను కూడా పంపించవచ్చు.
విదేశాల్లో ఉన్నవారికి కూడా...
విదేశాల్లో ఉన్నవారు ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చి నోట్లను మార్పిడి చేసుకోవడం ఎలా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే వారి కోసం కూడా రిజర్వ్ బ్యాంక్ తగిన వెసులుబాటు కల్పించింది. వారు తమ ప్రతినిధులను పోస్టాఫీసులకు, బ్యాంకులకు పంపించవచ్చు. ఖాతా ఉన్న బ్యాంకులకే వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం లేదు. ఖాతా లేని బ్యాంకుల్లో కూడా నోట్లను మార్పిడి చేసుకోవచ్చు.
రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో పాత నోట్లను తీసుకోకపోతే ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా అధికార వర్గాలు చెప్పాయి. అయితే, పెట్రోల్ బ్యాంకుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదు వందల మేరకు లేదా వేయి రూపాయల మేరకు పెట్రోల్ పోయించుకోవాలని, ఐదు వందలు లేదా వేయి రూపాయల నోటు ఇచ్చి వందో రెండు వందల రూపాయల మేరకో పెట్రోల్ పోయాలంటే వారు అ పనిచేయడం లేదని అంటున్నారు.