చరిత్ర: తవ్వకాల్లో బయటపడ్డ టిప్పు సుల్తాన్ కాలంనాటి రాకెట్లు
కర్నాటక: 18వ శతాబ్దపు రాజు టిప్పుసుల్తాన్కు సంబంధించిన వెయ్యికి పైగా రాకెట్లను కర్నాటకలో కనుగొన్నారు పురావస్తుశాఖ అధికారులు. షిమోగా జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో ఈ రాకెట్లు దొరికాయి. వీటిని యుద్ధ సమయంలో వినియోగించేందుకు దాచి ఉంచినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అయితే వీటిని చూసిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అత్యంత బలమైన నాయకుడిగా పేరుగాంచిన టిప్పుసుల్తాన్ 1799లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పై జరిగిన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో వీరమరణం పొందాడు. అప్పడే టిప్పుసుల్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్లను అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ రాకెట్లను మైసూరు రాకెట్లు అని పిలిచేవారు. ఈ తరహా రాకెట్లనే బ్రిటీషు వారు నెపోలియనిక్ యుద్ధాల్లో వినియోగించినట్లు తెలుస్తోంది.
బావిని తొవ్వుతున్న సమయంలో ఓ రకమైన వాసన వచ్చిందని అదేంటో కనుగొందామని మరింత లోపలికి తొవ్వగా ఈ రాకెట్లు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నిటినీ తవ్వి తీసేందుకు మూడురోజులు సమయం పట్టిందని తెలిపిన అధికారులు మొత్తం 15 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్లో పాల్గొని రాకెట్లను, పేలుడు సామగ్రిని వెలికి తీసినట్లు చెప్పారు. రాకెట్ల పొడవు 23 నుంచి 26 సెంటీమీటర్లున్నాయని చెప్పిన అధికారులు ప్రజల సందర్శనకోసం షిమోగాలోని మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు.