ప్రధాని భద్రత ఉల్లంఘన- దర్యాప్తు కమిటీ ఛీఫ్ కు బెదిరింపులు-సుప్రీం లాయర్లకూ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పంజాబ్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీల్ని కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూమల్హోత్రాతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు కొనసాగుతుండగానే కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఇందూ మల్హోత్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
ఈ వ్యవహారంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా దర్యాప్తు ప్రారంభించవద్దంటూ కొందరు అగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రధాని మోదీ కాన్వాయ్లో భద్రతా లోపాల కారణంగా ఫ్లైఓవర్పై 15-20 నిమిషాల పాటు చిక్కుకుపోవడంపై దర్యాప్తునకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా ప్యానెల్కు నాయకత్వం వహించాలని ఆదేశించారు. ప్యానెల్ ఏర్పాటు చేసిన కొన్ని రోజుల తర్వాత, ఇందు మల్హోత్రాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి కారకులెవరన్నది ఇంకా తేలలేదు. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్ధలే ఈ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో ఫిరోజ్ పూర్ వద్ద రైతుల ముసుగులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆయన్ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం వివిధ రూపాల్లో దర్యాప్తు చేయిస్తోంది.
అదే సమయంలో ప్రధాని భద్రత ఉల్లంఘనను సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు.. గతంలో నియమించిన కమిటీకి కూడా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అలాగే కొందరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు సైతం ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తుండటం సంచలనంగా మారింది. ఈ కేసును వాదించొద్దంటూ వారిపై ఖలిస్తాన్ గ్రూపులు ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది.