పంజాబ్ మంత్రివర్గ విస్తరణ: చరణ్జిత్ కేబినెట్లోకి 15 మంది, ఆరుగురు కొత్త ముఖాలకు చోటు
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో కొత్త పాతల కలయికలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 15 మందితో కూడిన నూతన మంత్రివర్గ జాబితాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆదివారం ప్రకటించారు. తాజా మంత్రివర్గంలో ఆరుగురు కొత్త ముఖాలకు చోటు దక్కింది.
వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్సింగ్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేబినెట్ కూర్పుపై ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే నూతన మంత్రివర్గ జాబితాను ప్రకటించారు. కాగా గత మంత్రివర్గంలో ఉన్న ఆరుగురిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేశారు. బ్రహ్మ్ మొహీంద్రా, మన్ప్రీత్ సింగ్ బాదల్, ట్రిప్ట్ రజిందర్ సింగ్ బజ్వా, సుఖ్బింద్రసింగ్ సర్కారియా, రానా గుర్జీత్ సింగ్ సహా మరో 10 మంది మంత్రులుగా గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
గత కేబినెట్లో తనను విస్మరించారని కలత చెందిన అమ్లోహ్ శాసనసభ్యుడు రణదీప్ సింగ్ నాభాకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటుకల్పించారు. కుల్జిత్ నగ్రా స్థానంలో ఆయనను ఎంపిక చేశారు. ఇసుక మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి రాణా గుర్జిత్సింగ్ను సైతం కేబినెట్కు ఎన్నుకోవడం గమనార్హం.
కాగా, ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిధ్దూకు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆ తర్వాత అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనకు ఇప్పటికే చాలా అవమానాలు ఎదురయ్యాయని, ఇక తాను భరించలేనని సీఎం పదవికి రాజీనామా చేసినట్లు అమరీందర్ సింగ్ తెలిపారు.
తాను తన రాజీనామాను మూడు వారాల ముందుగానే సోనియా గాంధీకి పంపానని.. అయితే, ఆమె తనను సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు అమరీందర్ సింగ్. ఆమె రాజీనామా చేయమంటే తాను చేసేవాడినని తెలిపారు. తాను ఓ సైనికుడినని.. అవసరమైన సమయంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అమరీందర్ సింగ్ తెలిపారు.
తన రాజకీయ భవిష్యత్తుపై తన శ్రేయోభిలాషులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు అమరీందర్ సింగ్ తెలిపారు. త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అమరీందర్ సింగ్ ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.