వడ్డీ రేట్ల పెంపుకు ఆర్బీఐ రంగం సిద్దం: మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ ఈ ఏడాది చివరి నుండి ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకటించింది. 2018 నాలుగో త్రైమాసికం నుండి వడ్డీ రేట్ల పెంపు సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది.
2018 నాలుగో త్రైమాసికం నుంచి వడ్డీరేట్ల పెంపు సీజన్ ప్రారంభమవుతుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలుపుతోంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల పరిధిలోనే ఉండే అవకాశం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.
గత కొద్ది త్రైమాసికాల నుంచి ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దీంతో వడ్డీరేట్లు అందుబాటులో ఉంటూ ఈఎంఐలు భారం కాకుండా ఉన్నాయి.
అయితే వడ్డీరేట్ల పెంపు శకం ప్రారంభమైతే రుణ కస్టమర్ల ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు పూనుకుంటుందని డచ్ బ్యాంక్ సైతం అంచనా వేసింది.