ఈ అవమానంతో షాకయ్యా, నా మాట విన్లేదు: సైరస్ మిస్త్రీ ఆగ్రహం
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తనకు అర్దాంతరంగా ఉద్వాసన పలకడంపై సైరస్ మిస్త్రీ స్పందించారు. చైర్మన్ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్కు గురి చేసిందని బోర్డు సభ్యులకు అతను ఈ మెయిల్ పంపించారు.
టాటా నుంచి తొలగింపు: పెదవి విప్పిన సైరస్ మిస్త్రీ
తనను ఇలా తొలగించడం బోర్డుకు ఏమాత్రం మంచిది కాదన్నారు. కనీసం తన వాదన కూడా వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అని బోర్డు పైన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం తనకు లీగల్ చర్య ఆలోచన లేదని చెప్పారు.
టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో ఆరుగురు సైరస్ మిస్త్రీ ఉద్వాసనను సమర్థించారు. దేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి, తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమించిన విషయం తెలిసిందే.
తనను చైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో తొలగించడంపై సైరస్ మిస్త్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించినట్లుగా కథనాలు వచ్చాయి. అదే సమయంలో లీగల్ చర్యలు తీసుకోకుండా టాటా గ్రూప్ కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది.
లీగల్ చర్యలు నివారించేందుకు ఉద్దేశించిన కెవియట్ పిటిషన్లను హైకోర్టులో టాటా గ్రూప్ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుతం లీగల్ చర్యలు తీసుకునేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.