ముస్లింలు భయపడొద్దు-ఆధిపత్యం వదులుకోండి- ఆరెస్సెస్ ఛీఫ్ సూచన-కపిల్ సిబల్ కౌంటర్
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రాన్ని వెనకుండి నడిపిస్తున్న ఆరెస్సెస్ అనేది ఆ వార్తల సారాంశం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వూలో ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందుస్తాన్ (భారత్) హిందుస్తాన్ గానే ఉంటుందని, ఇక్కడి ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని ఆరెస్సెస్ ఛీఫ్ వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ పత్రిక పాంచజన్య, ఆర్గనైజర్ లకు ఇచ్చిన ఇంటర్వూలో భగవత్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ముస్లింలకు ఇక్కడ ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. ముస్లింలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించారని, మళ్లీ పరిపాలిస్తారనే తమ ఆధిపత్య భావజాలాల్ని విడనాడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఇక్కడ నివసించే హిందువులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఎవరైనా సరే ఈ భావజాలాన్ని వదులుకోవాలని మోహన్ భగవత్ అన్నారు. దీనిపై విమర్శలు చెలరేగాయి.

ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మాజీ కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ మండిపడ్డారు. మోహన్ భగవత్ చేసిన హిందుస్తాన్ హిందుస్తాన్ గానే ఉంటుందన్న వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. హిందుస్తాన్ హిందుస్తాన్ గానే ఉంటున్నప్పుడు మనుషులు మనుషుల్లా ఉండాలిగా అంటూ సిబల్ వ్యాఖ్యానించారు. తద్వారా ఆరెస్సెస్ ఓవైపు అందరినీ కలుపుకుని పోతామని చెబుతూనే, మరోవైపు ముస్లింలపై దాడుల్ని ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయాన్ని సిబల్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications