కొత్త రికార్డులతో ప్రారంభమై.. మధ్యాహ్నానికి చతికిలపడి.. సాయంత్రానికి భారీ నష్టాలు!
దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతో ఆరంభ ట్రేడింగ్లో కొత్త రికార్డులతో మొదలైనప్పటికీ..
ముంబై: దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతో ఆరంభ ట్రేడింగ్లో కొత్త రికార్డులతో మొదలైనప్పటికీ.. మధ్యాహ్నానికి సూచీలు చతికిలపడ్డాయి.
సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో చివరి గంటల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 10,400 దిగువకు పడిపోయింది. మంగళవారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది.
బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు కుదేలవడంతో సూచీ మరింత దిగజారింది. దీంతో భారీ నష్టాన్ని చవిచూసింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో 360 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 33,371 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 102 పాయింట్లు నష్టపోయి 10,350 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి రూ. 65.03గా కొనసాగుతోంది.
లుపిన్ షేర్లు కుదేలు
ఔషద ఉత్పత్తుల సంస్థ లుపిన్ షేర్లు కుదేలయ్యాయి. గోవా, ఇండోర్లలోని లుపిన్ తయారీ కేంద్రాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటరీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో షేర్లు భారీగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో లుపిన్ ఒక్కో షేరు విలువ దాదాపు 17 శాతం పడిపోయింది. ఇక సిప్లా, ఎస్బీఐ, ఎయిర్టెల్, యూపీఎల్ లిమిటెడ్ షేర్లు కూడా పడిపోగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ పెట్రోలియం, టెక్మహింద్రా, టీసీఎస్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.












Click it and Unblock the Notifications