ఆ డేటా షేర్ చేస్తే!: కంపెనీలకు కేంద్రం హెచ్చరిక, కఠిన చర్యలే?
కస్టమర్ల వ్యక్తిగత డేటాను విక్రయించే కంపెనీల పట్ల కేంద్రం మున్ముందు కఠినంగా వ్యవహరించనుంది.
న్యూఢిల్లీ: కస్టమర్ల వ్యక్తిగత డేటాను విక్రయించే కంపెనీల పట్ల కేంద్రం మున్ముందు కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.
వాణిజ్య ప్రయోజనాల రీత్య కస్టమర్ల వ్యక్తిగత డేటానే ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్రం హెచ్చరించింది. ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ-కామర్స్ కంపెనీల కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ఫోకస్ చేసింది. వినియోగదారుల సంరక్షణ బిల్లులో ప్రభుత్వం దీని గురించి ప్రతిపాదించనుంది. దీని ప్రకారం ప్రజలు ఇలాంటి అనైతిక వాణిజ్య విధానాల పట్ల వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేసుకోవచ్చు.
కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ వీటిపై చర్యలు తీసుకునే హక్కులను కలిగి ఉంది. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాసయ్యే అవకాశముందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వన్ తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలో ప్రతి దేశం వినియోగదారులను కాపాడటానికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రూపొందించుకుుంటోందన్నారు.
విదేశాల్లో వినియోగదారుల సంరక్షణ పట్ల అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును పరిశీలించి.. వాటి నుంచి కూడా ఇక్కడి పాలసీ విధానాల్లో మార్పులు చేస్తున్నామని అన్నారు.