శ్రీనగర్ లో షాకింగ్ టెర్రర్ ఎటాక్స్ : స్కూల్లోకి చొరబడి కాల్పులు ..ఇద్దరు టీచర్లను హతమార్చిన ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల చర్యలను భద్రతా దళాలు కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు తెగబడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పౌరులను హతమారుస్తున్నారు. తాజాగా ఒక స్కూల్ లోకి చొరబడి ప్రిన్సిపాల్ తో పాటు ఒక టీచర్ ను హతమార్చారు.
శ్రీనగర్ పౌరులను కాల్చి చంపుతున్న ఉగ్రమూక
మంగళవారం శ్రీనగర్లో ప్రముఖ కెమిస్ట్ కాశ్మీర్ పండిట్ మఖన్ లాల్ బింద్రో ను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన చోటు చేసుకుంది .గంట వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాలలో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులను కూడా ఉగ్రవాదులు హతమార్చారు. ఇది మరిచిపోకముందే మళ్లీ జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారు. వ్యూహం మార్చిన ఉగ్రవాదులు మెరుపు దాడులకు దిగుతున్నారు. ఆర్మీ బేస్ క్యాంప్ లపై, పోలీసులపై దాడులకు ప్రయత్నాలు చేసిన ఉగ్రవాదులు, ఇప్పుడు ప్రజలపై దాడులకు తెగబడ్డారు.మంగళవారం రోజు శ్రీనగర్ పౌరులను కాల్చి చంపిన ఉగ్రవాదులు మళ్లీ గురువారం ఉదయం స్కూల్ లోకి చొరబడి ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చి చంపారు.

ఇద్దరు హిందూ ఉపాధ్యాయులను హతమార్చిన ఉగ్రవాదులు
ఊహించని విధంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో గురువారం కాశ్మీర్ లోయలో ఇద్దరు హిందూ ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు టీచర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వారిలో ఒకరు పాఠశాల ప్రిన్సిపాల్. ఇద్దరు ఉపాధ్యాయులు శ్రీనగర్లోని ఈద్గా సంగం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ప్రిన్సిపాల్ సుఖ్వీందర్ కౌర్ కాగా, రెండవ బాధితుడు ఉపాధ్యాయుడు దీపక్ అని పోలీసులు చెప్పారు.
హిందూ టీచర్లను వేరు చేసి స్కూల్ కాంపౌండ్ లోనే షూట్ చేసిన ఉగ్రవాదులు
ఇద్దరు టెర్రరిస్టులు ఒక్కసారిగా స్కూల్ లోకి చొరబడి ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో నలుగురు నుండి ఐదుగురు ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక పై మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులు ముస్లిం టీచర్లను గ్రూప్ నుండి వేరు చేసి ప్రిన్సిపాల్తో సహా ఇద్దరు హిందూ ఉపాధ్యాయులను పాఠశాల భవనం నుండి బయటకు లాక్కొచ్చి స్కూల్ కాంపౌండ్లో వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా స్కూల్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
టెన్షన్లో శ్రీనగర్ ప్రజలు .. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్కూల్ వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి డీజీపీతో సహా ఉన్నత పోలీసు అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ఉగ్రవాదులు ఎవరు అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు మరియు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేసిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉపాధ్యాయుల హత్యలను ఖండించిన జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ దాడిని ఖండించింది. శ్రీనగర్లో ఇద్దరు ఉపాధ్యాయుల హత్యకు సంబంధించిన భయంకరమైన వార్తలు తెరపైకి వస్తున్నాయని పేర్కొంది. ఈ మారణహోమం ఎప్పుడు ముగుస్తుంది అని ప్రశ్నించింది. ఇప్పటికైనా పాలకవర్గం అంతా సజావుగా ఉందని నినాదాలను చెప్పటం మానేస్తుందా అంటూ ప్రశ్నించింది. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా 'అని పార్టీ ట్వీట్ చేసింది.
టీచర్ల పై ఉగ్రదాడిని ఖండించిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్విట్టర్లో దాడిని ఖండించారు: "శ్రీనగర్ నుండి మళ్లీ షాకింగ్ వార్తలు వస్తున్నాయి. టార్గెట్ చేసి హత్య మారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఈసారి శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ అమానవీయమైన ఉగ్రవాద చర్యను ఖండించడం మాత్రమే సరిపోదని ఆయన అన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు
మొన్న ముగ్గురు హతం .. పార్మసిస్ట్ ను హతమార్చిన ఉగ్రమూక
ఉగ్రవాదులు వ్యాపారవేత్త మఖన్ లాల్ బింద్రో మరియు మరో ఇద్దరు పౌరులను మంగళవారం హత్య చేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. బింద్రోను శ్రీనగర్లోని తన ఫార్మసీలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. 1990లో కాశ్మీరీ తీవ్రవాదుల దాడుల సమయంలో కూడా శ్రీనగర్ నుండి వలస వెళ్ళని కాశ్మీరీ పండిట్ లలో బింద్రో ఒకరు. అతను శ్రీనగర్ ప్రజలకు ఎంతగానో సేవలు అందించారు. శ్రీనగర్ లో రాత్రి వేళల్లో కూడా ప్రజలకు మందులు అందించటం కోసం ఫార్మసీ నిర్వహించారు బింద్రో. ఉగ్రవాదులు ఆయనను టార్గెట్ చేసి మరీ హతమార్చారు.
దాడులు చేసిందెవరు ? జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో భయం
అదే రోజు కొంత సమయం తరువాత, శ్రీనగర్లోని హవల్ చౌక్ సమీపంలో బీహార్లోని భాగల్పూర్కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ అనే వీధి వ్యాపారిని ఉగ్రవాదులు చంపారు. అదే రోజు సాయంత్రం ఉత్తర కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలోని నైద్ఖాయ్ వద్ద మరో సాధారణ పౌరుడు మహ్మద్ షఫీ లోన్ను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. అసలు ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి? వీరినే ఎందుకు హతమార్చారు? ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకాలకు పాల్పడుతుంది ? జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఉగ్రమూక ఈ దాడులను చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ పండుగ సీజన్ లో ఉగ్రవాద దాడులు జరుగుతాయని ఇంటిలిజెన్స్ పదేపదే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో వాతావరణం టెన్షన్ పుట్టిస్తుంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications