తాజ్ మహల్కు టూరిస్ట్లు తగ్గుతున్నారు, ఎందుకో..
న్యూఢిల్లీ: తాజ్ మహల్ను చూసేందుకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత కొన్నేళ్లుగా టూరిస్టుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2012తో పోలిస్తే 2014లో దాదాపు లక్షమంది విదేశీ టూరిస్టుల సంఖ్య తగ్గింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో తెలిపింది. తాజ్ మహల్కు కొన్నేళ్లుగా క్రమంగా విదేశీయులరాక తగ్గుతోందని కేంద్రమంత్రి మహేశ్ శర్మ తెలిపారు.
2012లో వచ్చిన విదేశీయుల సంఖ్య 7.43 లక్షలుగా ఉందని చెప్పారు. ఆ తర్వాత 2013లో 6.95లక్షలు, 2014లో 6.48 లక్షలు వచ్చారని వెల్లడించారు. విదేశీ పర్యాటకుల సంఖ్య ఇలా ఎందుకు తగ్గుతోందన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సర్వే చేయించలేదన్నారు.
మంచి పర్యాటక వాతావరణం, హోటల్ గదుల ధరలు అందుబాటులో లేకపోవడం, ప్రస్తుత టూరిజం ట్రెండ్స్ వంటివి ప్రభావం చూపిస్తుండవచ్చునని తెలిపారు. కాగా, తాజ్ మహల్ ప్రపంచంలోని వింతల్లో ఒకటి. దీనిని పాలరాతితో కట్టారు.