ఇక టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్గా మార్చండి: లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్కు ఎంపీలు
న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని శుక్రవారం ఆ పార్టీ ఎంపీలు కోరారు.
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే కేశవరావుతోపాటు ఇతర ఎంపీలు లేఖలు అందజేసిన వారిలో ఉన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు చేసిన విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ వెంటనే స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్గా మార్చాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు. మరోవైపు, ఎంపీల విజ్ఞప్తిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ, మండలిలో బీఆర్ఎస్గా టీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పేరు మారిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలోనూ పార్టీ పక్షం పేర్లు అధికారికంగా మారాయి. ఇక నుంచి భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం(బీఆర్ఎస్ ఎల్పీ)గా వ్యవహరించనున్నారు. పార్టీ పేరు మారిన క్రమంలో శాసనసభ, మండలి రికార్డుల్లోనూ పేరు మార్చాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత.. కౌన్సిల్ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు.
పార్టీ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ విజ్ఞప్తికి అనుగుణంగా టీఆర్ఎస్ శాసనసభా పక్షం పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షంగా మారుస్తూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు మార్పునకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా తెలంగాణను ఏలుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పార్టీ పేరును మార్చుకున్న విషయం తెలిసిందే.