covid మూడో వేవ్: కేంద్రం అప్రమత్తత -చెక్లిస్ట్ సిద్ధం చేసుకోవాలని పరిశ్రమలకు పియూష్ సూచన
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఇప్పుడిప్పుడే నిదానిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం నాటి లెక్కల్లో కొత్తగా 1,32,788 కేసులు, 3,207 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గినా, మరణాలు ఇంకా మూడు వేలకుపైగానే ఉంటుండటం కలవరపెడుతున్నది. అందరికీ వ్యాక్సిన్లు అందని పరిస్థితుల్లో దేశంలో కరోనా మూడో దశ విలయం కూడా తప్పదనే హెచ్చరికలున్నాయి. వీటిపై కేంద్రం పరోక్షంగా కీలక స్పందన వెలువరించింది..
దేశానికి కరోనా మూడో దశ విలయం (థర్డ్ వేవ్) ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పారిశ్రామిక వర్గాలను అప్రమత్తం చేశారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్నిరకాల ప్రొటోకాల్ చెక్లిస్ట్ను సిద్ధం చేసుకోవాలని కోరారు. అలాగే, థర్డ్వేవ్లో వైరస్ ప్రభావానికి గురయ్యే చిన్నారులకు సాయం చేయాలని పారిశ్రామిక సంఘాలకు సూచించారు.
మోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలు
కరోనా లాక్ డౌన్, కదలికలపై ఆంక్షల కారణంగా పారిశ్రామిక రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుండటం, కరోనాతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై సన్నద్ధతకు సంబంధించి పారిశ్రామిక సంఘాలతో బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమీక్షించారు. ఇటీవల కరోనా కేసులు భారీగా పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని, లాక్డౌన్లు, ఆక్సిజన్ కొరత, కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, మరికొందరు కరోనా బారినపడటంతో నష్టం జరిగిందని మంత్రి అన్నారు.
మోదీ సర్కార్ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనం
కరోనా తొలి, రెండో దశల్లో నేర్చుకున్న అనుభవాలను పాఠాలుగా మలచుకుని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనాలని పారిశ్రామిక వర్గాలకు మంత్రి గోయల్ సూచించారు. ఈ సమావేశంలో సీఐఐ, పీహెచ్డీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారంతా కరోనాతో ఎదురైన అనుభవాలను పంచుకున్నారని, ఒకవేళ థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైన చర్చించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.