చైనాపై అమెరికా పన్ను పోటు..! ఇరు దేశాల మద్య ముదిరిన వాణిజ్య విభేదాలు..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : వాణిజ్య సుంకాలపై అమెరికాతో చైనా జరుపుతున్న చర్చలు మందగించిన వేళ అగ్రరాజ్యం మళ్లీ వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త సుంకాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. గత 10 నెలల నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని అమెరికాకు చైనా చెల్లిస్తోంది.
ట్రంప్ తాజా నిర్ణయంతో ఇతర ఉత్పత్తులపై చైనా చెల్లిస్తున్న 10 శాతం పన్ను.. ఇక నుంచి 25 శాతానికి చేరనుంది. చైనా, అమెరికాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు గత ఏడాది నవంబర్లో జరిగిన జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు నిర్ణయానికి వచ్చారు. 100 రోజులు ఇరు దేశాల సుంకాలు పెంచకూడదని నిర్ణయించాయి. ఈ గడువు మార్చి నెలతో ముగియగా.. అమెరికా మరోమారు ఈ వ్యవధిని పెంచింది. సమగ్ర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చైనా ఉన్నతాధికారులు సమావేశం బుధవారం వాషింగ్టన్లో జరగనుండగా.. సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.