నెహ్రూపై మోడీ ట్వీట్, మేమూ తప్పుచేశామని రాహుల్
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మూడు దేశాల పర్యటనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్లో ఉన్న మోడీ ట్విట్టర్లో నెహ్రూకు నివాళులర్పిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని కీర్తించారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ గణనీయ సేవలందించారన్నారు. ఈ రోజు మనం నెహ్రూ 125వ జయంతి జరుపుకుంటున్నామని, ఆయనకు తాను నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, నెహ్రూ 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే వారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో పార్టీ తరపున పాల్గొనే బృందంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ను సభ్యుడుగా నియమించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వచ్చే సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరపున పాల్గొనే తొమ్మిది మంది సభ్యుల బృందానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారు. రాహుల్ నాయకత్వం వహించే బృందంలో ఖాన్తో పాటు మరో 7గురు కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారు.
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు గురువారం మోడీ పైన విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. నెహ్రూ వారసత్వాన్ని తుడిచేసేందుకు కుట్ర జరుగుతుందని సోనియా ఆరోపిస్తే, స్వచ్ఛ్ భారత్ పేరిట ఒకవైపు రోడ్లు ఊడుస్తూనే, మరోవైపు విషం చిమ్ముతున్నారంటూ రాహుల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం కోపిష్టులు దేశాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛ్ భారత్ పత్రికల్లో ఫొటోల కోసమే తప్ప దేశాన్ని తీర్చిదిద్దేందుకు కాదని వ్యంగ్య విమర్శలు చేశారు. తొలి ప్రధాని నెహ్రూ 125వ జయంత్యుత్సవం సందర్భంగా టల్కటోరా ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సోనియా, రాహుల్ మాట్లాడారు. భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన నెహ్రూ దృష్టికోణాన్ని రూపుమాపేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయ్నారు.
నెహ్రూ వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవితాంతం పోరాడి సాధించిన లక్ష్యాలనూ రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నెహ్రూ స్వేచ్ఛ, ఉదార స్వభావం గల భారతదేశం కోసం కలలుగన్నారు. వివిధ వర్ణాలు, వర్గాలు మమేకమై జీవనం సాగించే దేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు నెహ్రూ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. వ్యక్తులకంటే వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చి, అదే దారిలో దేశాన్ని ముందుకు నడిపించటం ఆయన గొప్పతనాన్ని చాటుతోందన్నారు.
కాంగ్రెస్ ఎన్నో రాజకీయ తుపానులు చూసిందని, ఎన్నో తుపానులను ఎదురొడ్డి నిలిచిందన్నారు. నెహ్రూ సిద్ధాంతాల ఆచరణ ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. తొలి ప్రధాని ఆశలు, ఆశయాలను చిన్నాభిన్నం చేస్తున్న వారిపై సమైక్య పోరాటానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి లౌకిక సిద్ధాంతాల కోసం పోరాడాలని సోనియ సూచించారు.
ప్రస్తుత పాలకులు కోపిష్టులంటూ మోడీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. స్వచ్ఛ్భారత్ పేరిట చీపుర్లు పట్టి రోడ్లు ఊడుస్తున్నట్టు ఫొటోలు తీయించుకుంటూ, మరోపక్క విషం చిమ్ముతున్నారన్నారు. ప్రేమ సందేశంతో స్వాతంత్య్రం సంపాదించుకున్న భారత దేశాన్ని కోపిష్టులు పాలిస్తున్నారన్నారు. ఇంగ్లీష్కు బదులు హిందీని ప్రోత్సహించాలని ప్రచారం చేస్తున్నారు, అయితే మనం దీన్ని ఎదుర్కొనాలన్నారు.
ప్రేమ, సోదరభావానికి కాంగ్రెస్ ప్రతీకగా అభివర్ణించారు. బ్రిటీష్ పాలకులు దేశం విడిచిపోయిన తరువాత నెహ్రూలాంటి నాయకుడు ఇంగ్లీష్ను దేశం నుంచి వెళ్లగొట్టలేదు. మిగతా ప్రపంచంతో కలిసి ఉండేందుకు ఇంగ్లీష్ అవసరాన్ని ఆనాడే నెహ్రూ గుర్తించారు. అందుకే, మనమీనాడు ఇంతదూరం రాగలిగామని వ్యాఖ్యానించారు.
ఇంగ్లీష్ను దేశం నుంచి తొలగించివుంటే ఐఐటి, ఐటిలు ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. ఇంగ్లీష్ నేర్చుకోకుంటే భారతీయులు అమెరికాలో ఇంత ప్రగతి సాధించి ఉండేవారా? అన్నారు. కాంగ్రెస్ కూడా తప్పులు చేసిందంటూనే, ఆ పార్టీ హృదయం, సిద్ధాంతాలు నిర్మలమైనవన్నారు. కాంగ్రెస్ కూడా పొరపాట్లు చేసిందని చెప్పడం గమనార్హం.