పశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతి
పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 44 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 78,931 మందితో కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది . అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది . తాజాగా ఒక పోలింగ్ బూత్ వద్ద అగంతకులు కాల్పులు జరపటంతో ఒకరు మరణించారు . ఆపై బీజేపీ , టీఎంసీ మధ్య ఘర్షణలతో మరో ముగ్గురు మొత్తం నలుగురు ఇప్పటివరకు మరణించారు .
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న నాల్గవ దశ ఎన్నికల పోలింగ్
కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్లో పోలింగ్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంటుంది. శనివారం కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఉత్తర బెంగాల్లోని అలీపుర్దువార్ మరియు కూచ్ బెహార్ మరియు హౌరా, హూగ్లీ, సౌత్ 24 పరగణాలు మరియు దక్షిణ బెంగాల్లోని కోల్కతాలోని కొన్ని ప్రాంతాలలో జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికలలో నాల్గవ దశకు ఓటింగ్ జరుగుతోంది .
కూచ్ బెహార్లోని సితాల్కుచి పోలింగ్ కేంద్రం వద్ద నాటుబాంబుల కలకలం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2016 లో గెలిచిన భబానిపూర్ లో కూడా ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ఒకపక్క పోలింగ్ కొనసాగుతుండగానే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకుడు లాకెట్ ఛటర్జీ కారును హుగ్లీలో స్థానికులు దాడి చేశారు. ఇదిలా ఉంటే కూచ్ బెహార్లోని సితాల్కుచి పోలింగ్ కేంద్రం వెలుపల బాంబులు విసరడంతో ఘర్షణలు జరిగాయి. కూచ్ బెహార్లోని సితాల్కుచిలో శనివారం పోలింగ్ బూత్ నంబర్ 285 బూత్ వెలుపల అగంతకులు బాంబులు విసిరారు. ఈ ప్రాంతం నుండి పోలీసులు అనేక నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
కూచ్ బెహార్లో ఓటర్ల క్యూపై దుండగుల కాల్పులు... ఒకరు మృతి .. ఘర్షణల్లో నలుగురు మృతి
కూచ్ బెహార్లో ఓటర్ల క్యూపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడానికి పోలీసులు లాఠీ చార్జ్ను చేశారు. మరణించిన వ్యక్తి సోదరుడు తాము బిజెపి మద్దతుదారులమని చెప్తున్నారు . మరణించిన వ్యక్తి టిఎంసి మద్దతుదారుడని టిఎంసి చెబుతోంది. ఈ మరణ సంఘటనపై నివేదిక సమర్పించాలని ఈ సి కోరింది. ఒకరి మృతి నేపధ్యంలో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఓటింగ్ కొనసాగుతున్న సమయంలో బిజెపి, తృణమూల్ కార్మికులు ఘర్షణ లో బెంగాల్ కూచ్ బెహార్ జిల్లాలో మొత్తం నలుగురిని కాల్చి చంపారు .ఇక పోలింగ్ సమయంలో ఉద్రిక్తతల పై తృణమూల్ కాంగ్రెస్ శనివారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది .
ఈసీకి టీఎంసీ ఫిర్యాదు ... హెల్మెట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన నటాబరి నియోజకవర్గ టిఎంసి అభ్యర్థి
సితాల్కుచి, నటల్బరి, తుఫంగాంజ్ మరియు దిన్హాటాలోని అనేక బూత్లలో, బిజెపి గూండాలు బూత్ వెలుపల ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని , టిఎంసి ఏజెంట్లు బూత్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని లేఖలో పేర్కొంది.ఈ ప్రాంతంలో పోలింగ్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో బిజెపిపై చర్యలు తీసుకోవాలని టిఎంసి డిమాండ్ చేసింది. ఇదిలావుండగా, కూచ్ బెహార్లోని నటాబరి నియోజకవర్గానికి చెందిన టిఎంసి అభ్యర్థి రవీంద్ర నాథ్ ఘోష్ శనివారం ఉదయం హెల్మెట్ ధరించి కనిపించారు.
అవాంఛనీయ సంఘటనలు జరిగితే తనకు రక్షణగా హెల్మెట్ పెట్టుకున్నానన్న టీఎంసీ నేత
హెల్మెట్ ధరించి తమకు రక్షణ లేదని ఆయన కేంద్ర సర్కార్ తీరుపై తన వ్యతిరేకత వ్యక్తం చేశారు . ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి నేను దీనిని ధరిస్తున్నాను అని ఆయన తెలిపారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ లో నాలుగవ దశ ఎన్నికల పోలింగ్ అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. మమతా బెనర్జీ వర్సెస్ మోదీగా మారిన ఈ పోరులో ఇది నాల్గవ దశ ఎన్నిక కాగా ఇంకా నాలుగు దశల పోలింగ్ సాగాల్సి ఉంది.