ఆహా.. జాక్ పాట్ కొట్టేశారు: 8 మంది భారతీయులకు తలో రూ.1.76 కోట్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో ప్రతీనెలా లగ్జరీ కార్ల, ప్రైజ్ మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఓ లక్కీ డ్రాలో 8 మంది భారతీయుల పంట పండింది.
దుబాయ్: తంతే బూరెల గంపలో పడడం అంటే ఇదే! అర్థరాత్రి నిద్రలేపి మరీ అదృష్టదేవత ఇంట్లోకి రావడమంటే కూడా ఇదే! విషయం ఏమిటంటే.. అబుదాబిలో 'బిగ్ టికెట్ లక్కీ డ్రా' 8 మంది భారతీయులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో ప్రతీనెలా లగ్జరీ కార్ల, ప్రైజ్ మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఓ లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది.
ఈ లక్కీ డ్రా వరించిన 10 మంది విజేతల్లో 8 మంది భారతీయులున్నారు. ఒక్కొక్కరు 2.7 లక్షల డాలర్లు (మన కరెన్సీలో రూ.1.70 కోట్లు) ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ పది మంది విజేతలలో ఒక కెనడియన్, ఒక ఫిలిప్పీన్స్ దేశస్థుడు ఉండగా, మిగిలిన వారంతా భారతీయులు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో విజేతలంతా అమితాశ్చర్యానికి లోనయ్యారు. వారి ఆనందానికి అవధులు లేవు. ''పదేళ్ల నుంచి టిక్కెట్లు కొంటున్నా.. లక్కీ డ్రా ఏరోజు తీస్తున్నారన్నది కూడా నాకసలు గుర్తులేదు.. కానీ నాకు ప్రైజ్ మనీ రావడం మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగిస్తోందని విజేతల్లో ఒకరు వ్యాఖ్యానించారు.
దుబాయ్ లోని ఓ జ్యువెలరీ గ్రూప్ లో చీఫ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న చంద్రేశ్ మోతివారస్ అనే విజేత మాట్లాడుతూ ''నాకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ డబ్బెలా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తున్నా. ప్రస్తుతానికైతే నాకెలాంటి ప్రణాళికలు లేవు..'' అని చెప్పారు.
ఇక మరో విజేత, అబుదాబిలోని స్పిన్నీస్ అనే సంస్థలో పర్చేజింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న అభయ కుమార్ క్రిష్ణన్ మాట్లాడుతూ.. ''నాకు ఫస్ట్ టైం కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదు. స్నేహితులెవరో నన్ను ఆట పట్టించడానికి కాల్ చేసి ఉంటారనుకున్నా.. రెండోసారి బిగ్ టిక్కెట్ నిర్వాహకులు ఫోన్ చేసినప్పుడు మాత్రం షాక్ కి గురయ్యా..'' అంటూ తన మనోభావాలను వెల్లడించారు.
మరో విజేత మాట్లాడుతూ.. ''ఈ డబ్బు నేను నా స్నేహితునితో పంచుకుంటూ.. ఎందుకంటే, మేమిద్దరం కలిసే ఈ టిక్కెట్ కొన్నాం. కొంత డబ్బు కేరళలోని చారిటీలకు ఇచ్చేస్తాం..'' అంటూ చెప్పుకొచ్చారు.