గాలిలో విమానం, ఇంజిన్కు భారీ రంధ్రం: 297మందిని కాపాడిన అప్రమత్తత
చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ ఏ330కి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంజిన్కు భారీ రంధ్రం ఏర్పడింది.
సిడ్నీ: చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ ఏ330కి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంజిన్కు భారీ రంధ్రం ఏర్పడింది. దీంతో కాలిపోతున్నట్లుగా వస్తున్న వాసనను పసిగట్టిన ప్రయాణికులు పైలట్కు సమాచారమందించారు.
వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఒక్కసారిగా విమానంలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ విమానంలో మొత్తం 297మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం సిడ్నీ నుంచి చైనాలోని షాంఘైకి బయలుదేరిన గంట తర్వాత పెద్దగా శబ్ధం వచ్చింది. అనంతరం కాలిపోతున్న వాసన రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. గాల్లో ఎగురుతున్న విమానం పెను ప్రమాదానికి గురవుతున్నదనే భయంతో కేకలు వేశారు.
అప్రమతమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి.. సిడ్నీలో సురక్షితంగా దించారు. విమానం ఇంజిన్కు భారీ రంధ్రం ఏర్పడిందని.. ఇంకాసేపు విమానం గాల్లోనే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. కాగా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ సదరు విమాన ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.