జర్మన్ వింగ్స్ విమానం మరో కొత్త ట్విస్ట్: కోపైలట్ కూల్చలేదా?
ప్యారిస్: జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్ ఏ320 విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కో పైలట్ ఆండ్రూ ల్యూబిట్జ్ కూల్చి వేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ విమానం ప్రమాదం విషయంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది.
కాక్పిట్లో పైలట్ పాట్రిక్ తాగిన కాఫీలో కో పైలట్ ల్యూబిడ్జ్ డ్రగ్స్ కలిపి ఉంటాడని ఫ్రెంచ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాలసిస్ సంస్థ భావిస్తోంది. కాఫీలో పదే పదే మూత్ర విసర్జన కలిగించే ద్రవం కలపడం ద్వారా పైలట్ను కాక్ పిట్ నుండి బయటకు పంపితే, తన కుట్రను సులువుగా అమలు చేయవచ్చునని ల్యూబిట్జ్ భావించి ఉంటాడంటున్నారు. అందుకే డ్రగ్కు సంబంధించిన సమాచారాన్ని అతను ఇంటర్నెట్లో వెతికాడని చెబుతున్నారు.
ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. జెర్మన్ వింగ్స్ ప్రమాదానికి, అందులో ఉన్న 150 మంది మృతికి ల్యూబిట్జ్ కారణం కాకపోవచ్చునని చెబుతున్నారు. ఎవరో హ్యాకింగ్ చేసి విమానం కూల్చేయవచ్చుననే కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ హ్యాకింగ్ కావొచ్చునని అనుమానిస్తున్నారు.