డొక్లామ్ ఎఫెక్ట్: ఇండియన్ ఆర్మీ సరికొత్త ఆలోచన, ఒంటెలతో పహారా
న్యూఢిల్లీ: భారత ఆర్మీ కొత్త ఆలోచన చేస్తోంది. చైనాతో డొక్లామ్ వివాదం నేపథ్యంలో సిక్కిం - టిబెట్ - భూటాన్ కూడలలో చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త కార్యాచరణ రూపొందించే పనిలో పడింది.
లడక్లోని వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను నియంత్రించడం కోసం తనిఖీలు నిర్వహించేందుకు ఒంటెలను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది. సరిహద్దుల్లో పహారా కాయడానికి, పెద్ద మొత్తంలో మందుగుండు, ఇతర సామగ్రి మోసుకెళ్లే విధంగా వీటికి శిక్షణ ఇస్తారు.
దీనిలో భాగంగా సింగిల్ హంప్డ్, డబుల్ హంప్డ్ అనే రెండు రకాల ఒంటెలను ఉపయోగించాలని సైన్యం ఆలోచన చేస్తోంది. వీటిలో డబుల్ హంప్డ్ ఒంటెలు గరిష్ఠంగా 180 నుంచి 220 కేజీల వరకు బరువును మోస్తూ 2గంటల్లో 10 నుంచి 15 కి.మీ. వరకు నడవగలవు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే 12,000 నుంచి 15,500 అడుగుల ఎత్తులో వీటిని ఉపయోగించాలని సైన్యం భావిస్తోంది.