భారత ఎంబసీపై దాడిలో పాక్ సైనికాధికారులు!
కాబూల్: భారత రాయబార కార్యాలయంపై గత వారం జరిగిన దాడిలో పాకిస్థాన్కు చెందిన సైనికాధికారులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్థాన్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.
‘మేం మా కళ్లతో స్వయంగా చూశాం. దాడికి పాల్పడిన వారిలో పాకిస్థాన్ సైనికాధికారులున్నారని 99 శాతం కచ్చితంగా చెప్పగలం' అని బాల్ఖ్ రాష్ట్ర పోలీసు అధిపతి సయ్యద్ కమాల్ సాదత్ తెలిపారు.
వారు బాగా శిక్షణ పొందిన వ్యక్తులని, పూర్తి నిఘా సమాచారంతో దాడికి దిగారని చెప్పారు. అయినప్పటికీ అల్లా దయతో వారిని సమర్థవంతంగా ఎదుర్కోవటమేగాక, మట్టబెట్టగలిగామని చెప్పారు. దాడికి దిగిన వారికి సాయం అందించిన వ్యక్తులను గుర్తించే పని ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు.
ఇటీవల వరుసగా రెండు సార్లు భారత దౌత్య కార్యాలయంపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు, సైనికాధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రెండు దాడులను ఆప్ఘాన్ పోలీసులు, భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.