Pik talk: అమెరికా కార్గో ఫ్లైట్లో 800 మందికి పైగా ఆఫ్ఘన్లు..ఇసుక వేస్తే రాలనంతగా
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకునే పరిస్థితికి వచ్చినట్టు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. అందుకే జీవితాలను పణంగా పెట్టి మరీ.. సాహసాలకు పాల్పడుతున్నారు. ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎంత భయానకంగా ఉంటుందో ఇదివరకే ఓ సారి చవి చూసిన అనుభవం ఉన్నందున ఏకంగా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఈ క్రమంలో ఊపిరి వదులుతున్నారు.
Video: మస్త్ మజా: తాలిబన్లలో ఈ యాంగిల్ కూడా ఉందా: కాబుల్ అమ్యూజ్మెంట్ పార్క్లో
ప్రాణాలను పణంగా పెట్టి..
తాలిబన్లు రాజధాని కాబుల్ను ఆక్రమించుకున్న వెంటనే.. వేలాదిమంది ఆప్ఘన్ ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారు. అందిన విమానాన్ని పట్టుకుని పుట్టిన గడ్డను వీడి వెళ్లిపోవాలనేది వారి తాపత్రయం. ఇలా వేలాదిమందిగా తరలి వచ్చిన ఆప్ఘన్లతో కాబుల్ విమానాశ్రయం కిటకిటలాడింది. అత్యంత ప్రమాదకర స్థితుల్లో వారు విమానాలు ఎక్కడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారి దైన్య స్థితికి అద్దం పట్టాయి.
ప్రమాదకరంగా ప్రయాణం..
అప్పటికే కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరిన అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను రక్షించే క్రమంలో ఆ దేశ సైనికులు స్థానికులపై కాల్పులు జరపాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పండిందంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాల్పుల్లో అయిదుమంది మరణించారు. కాగా- కాబుల్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకోవడానికి రన్వేపైకి వచ్చిన అమెరికా సైన్యానికి చెందిన యూఎస్ సీ-17 ఎయిర్ క్రాఫ్ట్కు వందలాది మంది ఆప్ఘనిస్తానీయులు చుట్టూమూగడం.. దాని టైర్లు, డోర్లకు వేలాడుతూ ప్రయాణించడానికి ప్రయత్నించడం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.
పిక్ టాక్..
ఆ వెంటనే- మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికా సైన్యానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సీ-17 గ్లోబ్ మాస్టర్-3 ఇన్సైడ్ పిక్ ఇది. దీన్ని డిఫెన్స్ వన్ విడుదల చేసింది. ఈ కార్గో ఎయిర్ క్రాఫ్ట్లో 800 మందికి పైగా ఆప్ఘనిస్తానీయులు ప్రయాణించారు. సైన్యానికి నిత్యావసర సరుకులు, ఇతర ఆయుధ సామాగ్రిని తరలించడానికి వినియోగించే ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఇన్ని వందల మంది ఒకేసారి ప్రయాణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాలిబన్ల పాలన పట్ల వారిలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పట్టింది.
మహిళలు..చంటిపిల్లలు
ఈ 800 మందిలో పలువురు మహిళలు, చంటి పిల్లలు కూడా ఉన్నారు. కాబుల్ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్న ఈ ఫ్లయిట్ ఖతర్కు వెళ్లింది. అమెరికా డెలావర్లోని డోవర్ ఎయిర్ బేస్కు చెందిన ఈ ఫ్లయిట్లో మిలటరీ కార్గోలో 871 మంది ఆఫ్ఘనిస్తానీయులు ప్రయాణించినట్లు డిఫెన్స్ వన్ తెలిపింది. ఒక మిలటరీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్లో ఇంతమంది ప్రయాణించడం ఇదివరకెప్పుడు జరగలేదు. ఇదే తొలిసారి. దీన్ని ఓ రికార్డుగా భావిస్తోన్నారు.
Recommended Video
హయ్యెస్ట్ ట్రావెలర్స్..
2013లో ఫిలిప్పీన్స్ను అతలాకుతలం చేసిన తుఫాన్ సమయంలో- యూఎస్ సీ-17 గ్లోబ్ మాస్టర్-3 ఎయిర్ క్రాఫ్ట్ సేవలను వినియోగించుకున్నారు. ప్రజలను సురక్షితంగా తరలించడానికి దీన్ని రంగంలోకి దించారు. అప్పట్లో గరిష్ఠంగా 670 మందిని ఈ ఫ్లయిట్ తరలించింది. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరిగింది. 871కి చేరింది. కాగా.. ఎయిర్ క్రాఫ్ట్లో 800 మందికి పైగా ఉన్నారనే సిబ్బంది మాటలు రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. గ్రౌండ్ స్టాఫ్ మాత్రం 640 మందే ప్రయాణించినట్లు తెలిపారు. ఏదేమైనప్పటికీ- ఇసుక వేస్తే రాలనంతగా.. కాలు మోపడానికి కూడా స్థలం లేనంతగా క్రిక్కిరిసి పోయిందీ ఎయిర్ క్రాఫ్ట్.