వాటర్ వార్ : ఆంధ్రోళ్ళంతా లంక వాసులా ... తెలంగాణా మంత్రి వ్యాఖ్యలపై కర్నూలు టీడీపీ నేతలు ఫైర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్నా తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో అది మరింత ముదిరింది. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని ఆంధ్ర వాళ్ళు అందరూ తెలంగాణ వ్యతిరేకులేనని ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రాజెక్టులపై యుద్ధానికి సిద్ధం కావాలని తెలంగాణ మంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు టిడిపి నాయకులు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్ర ప్రజలను లంక వాసులతో పోల్చడంపై కర్నూలు టిడిపి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టమొచ్చినట్టు నీటిని దొంగతనం చేస్తోందని ఆరోపించారు మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ తిక్కా రెడ్డి. ఇక తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ ద్వారా కుడికాలువ పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎప్పుడో జరగాల్సిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు . తాము త్రాగు నీరులేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఒక పక్క జల చౌర్యం చేస్తూ ఏపీ పై యుద్ధం చేయాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ నాయకులు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదంటూ హితవు పలికారు. ఇప్పటికే తెలంగాణా మంత్రి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు . మంచితనం చేతకానితనం అనుకుంటే పొరబాటు అంటూ తేల్చి చెప్పారు.