గ్రామానికి 20 లక్షలు, హుజూర్నగర్ పట్టణానికి 25 కోట్లు, కృతజ్ఞతసభలో కేసీఆర్ వరాలజల్లు
హుజూర్నగర్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో విజయం తమలో మరింత సేవాభావాన్ని, అంకితభావాన్ని పెంచుతుందన్నారు. తమపై ప్రతిపక్షాలు ఎన్నో నిందలు వేశాయని కేసీఆర్ సునిశితంగా విమర్శించారు.
వరాల జల్లు
హుజూర్నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు కురిపంచారు. నియోజకవర్గంలో గల 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయిస్తున్నానని ప్రకటించారు. 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి రెండు, మూడురోజుల్లో జీవో విడుదలవుతుందని పేర్కొన్నారు.
జీ హుజూర్..
హుజూర్నగర్ పట్టణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. నేరుడుచర్లకు కూడా రూ.15 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. హుజూర్ నగర్ను డివిజన్ చేస్తామని హామీనిచ్చారు. గిరిజనుల చిరకాల కోరిక తండాలను పంచాయతీలుగా మార్చింది తామేనని పేర్కొన్నారు. తమ హయాంలో 3 వేల తండాలు, గూడెలను ప్రభుత్వం పంచాయతీలుగా చేసిందని పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా 30 తండాలు పంచాయతీలుగా మారాయనే విషయాన్ని గుర్తుచేశారు.
హుజూర్నగర్కు రెసిడెన్షియల్
రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని కేసీఆర్ చెప్పారు. కానీ హుజూర్నగర్లో లేదని.. ఇక్కడ తక్షణమే గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తామరి పేర్కొన్నారు. దీంతోపాటు బంజారా భవన్ నిర్మిస్తామని తెలిపారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్లో పోడుభూముల సమస్య ఉందని.. త్వరలోనే ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లో కార్యక్రమం చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. హుజూర్ నగర్ కోర్టు పరిధిలో మేళ్లచెర్వు, చింతలచెరువు పరిధి తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు.
60 ఏళ్లుగా వివక్ష
60 ఏళ్లలో నల్గొండ అభిృద్ధికి నోచుకోలేదని అంతకుముందు మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్ది గుర్తుచేశారు. కానీ కేసీఆర్ హయాంలో అభివృద్ధి పుంతలు తొక్కుతుందని చెప్పారు. తాము చేసిన పనులే టీఆర్ఎస్ అభివృద్ధికి నాంది పలికిందని చెప్పారు. నల్గొండ జిల్లాకు నాలుగేన్నరేళ్లలో రూ.50 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. పవర్ ప్లాంట్తో జిల్లా రూపురేఖలు మారిపోయాయని జగదీశ్ రెడ్డి చెప్పారు. యాదాద్రి రూపురేఖలు మార్చారాని.. ప్రపంచ చిత్రపటంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని జగదీశ్ రెడ్డి చెప్పారు.