అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచించేవారు, ఇప్పుడు పరిస్థితి మారింది: కేటీఆర్
మునుగోడు బై పోల్ ప్రచారం హోరెత్తుతుంది. నియోజకవర్గాన్ని నేతలు చుట్టేస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు హోరెత్తుతున్నాయి. మన్నెగూడలో గౌడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు.
ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని వివరించారు. ఇప్పుడు ఇంటి ముందే నల్లా ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు ధీమాగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారని వివరించారు.
బీజేపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. బలహీనవర్గాలపై ఆ పార్టీకి ప్రేమలేదని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. గౌడ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, వారికి త్వరలో మోపెడ్ వాహనాలు ఇస్తున్నామని వెల్లడించారు.
ప్రతి నెలా వారికి పెన్షన్లు ఇస్తున్నామని, చెట్ల పన్ను రద్దు చేశామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గల ప్రతీ సామాజిక వర్గానికి అండగా ఉంటున్నామని తెలిపారు. కులాలకు సంక్షేమ భవనాలు కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఎక్కడ ఎవరికీ ఆపద వచ్చినా సరే.. తాము ఉన్నామని వివరించారు.