సాగర్ బీజేపీ అభ్యర్థి ఖరారు, ఎస్టీ వైపు మొగ్గు.. రవికుమార్ నాయక్
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సెగలు రేపుతోంది. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, టీఆర్ఎస్ నుంచి భగత్ బరిలోకి దిగారు. బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ రవి కుమార్కు టికెట్ ఇస్తున్నట్టు కన్ఫామ్ చేసింది. రవి కుమార్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. గత కొన్నాళ్లుగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీలో క్రియాశీల నేతగా పనిచేస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి ఇతనే..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్ను ఎంపిక చేశారు. పానుగోతు రవికుమార్ను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. జనరల్ కేటగిరి సీటు కాగా.. ఎస్టీ అయిన రవికుమార్కు సీటు కేటాయించారు. ఈ విషయంలో బీజేపీ వ్యుహాత్మకంగా పనిచేసింది. అక్కడ ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవాలని భావించింది. ఇటు రవి కుమార్ పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్గా పని చేశారు. రవికుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బరిలో వీరే
ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి, టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య తనయుడు భగత్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆకర్షణీయమైన హామీలు ఇస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
జనరల్ సీటులో ఎస్టీకి టికెట్
రవి కుమార్ లంబడి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన పూర్తిపేరు పాను గోతు రవికుమార్ కాగా.. త్రిపురారం మండలంలోని పలుగు తండ స్వగ్రామం. పానుగోతి హరి, దస్సి దంపతులకు 1985లో జన్మించారు. మెడిసిన్ చేసి.. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్గా బాధ్యతలు నిర్వహించారు. రవికుమార్ సతీమణి పానుగోతు సంతోషి కాగా.. పిల్లలు మన స్వీత్, వీనస్ ఉన్నారు. నిర్మల ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.