కరోనా రోగుల కోసం రోబో- నెల్లూరు వాసి ఆవిష్కరణ- ఏయే పనులు చేస్తుందో తెలుసా ?
కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ రోబో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీని పనితీరుకు ముచ్చట పడిన జిల్లా అధికారులు మరో నాలుగు రోబోలను తయారు చేసి ఇవ్వాలని వెంటనే కోరారంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతుంది.
కరోనా రోబో ఆవిష్కరణ...
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాలు సైతం ప్రజలకు సామాజిక దూరాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. రోగులను ముట్టుకుంటే ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. అలాంటిది రోగుల వద్దకు వెళ్లి మందులు ఇవ్వాలంటే ఎంత భయపడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి పరిష్కారంగా నెల్లూరుకు చెందిన పర్వేజ్ అనే టెకీ తయారు చేసిన రోబో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దీని అవసరం ఏంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
రోగులకు మందులిచ్చి, యోగక్షేమాలు తెలుసుకుని...
కరోనా వైరస్ సోకిన రోగులకు కావాల్సిన మందులను డాక్టర్లు రోబోకు ఇస్తే ఇది వాటిని తీసుకెళ్లి రోగుల వద్దకు వెళ్లి అందజేస్తుంది. అంతే కాదు వారు డాక్టర్లతో ఏమైనా చెప్పానుకుంటే దాన్ని లైవ్ లోనే వారికి తెలియచేస్తుంది. అలాగే డాక్టర్లు ఇచ్చే సూచనను కూడా లైవ్ లోనే రోగులకు తెలియజేస్తుంది. మందులతో పాటు ఇతర సామాగ్రిని కూడా ఇది రోగులకు అందజేస్తుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉండటం ఇందులో మరో ప్రత్యేకత. ఈ రోబో రాకతో ఇక రోగుల వద్దకు ప్రతీసారీ వెళ్లాల్సిన అవసరం లేకుండా డాక్టర్లు తమ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
Recommended Video
నెల్లూరు ఎంపీ ఆదేశాలతో తయారీ...
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో స్ధానికంగా నివసించే నిజాముద్దీన్ అనే వ్యక్తి తన మేనల్లుడు పర్వేజ్ తో కలిసి దీనికి రూపకల్పన చేశాడు. దీన్ని జిల్లా జడ్పీ కార్యాలయంలో కలెక్టర్ శేషగిరిబాబుకు ఇవాళ అందజేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి దీన్ని రూపొందించామని, ఇది అందించే సేవలు కూడా అమూల్యమైనవని నిజాముద్దీన్ తెలిపాడు. ఈ రోబో పనితీరు పట్ల ఆకర్షితులైన జిల్లా కలెక్టర్, ఎంపీ ఆదాల మరో నాలుగు రోబోలు తెప్పించి జిల్లాలోని వివిధ ఆస్పత్రులకు పంపాలని నిర్ణయించారు. వీటిని తయారు చేసి ఇవ్వాలని వీటి రూపకర్త పర్వేజ్ ను వారు కోరారు.