సాఫ్టువేర్ ఇంజినీర్: టెక్కీలకు షాక్: 35 ఏళ్లకు పైబడితే..!
ఆటో మోషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెక్టారులో ఉద్యోగాల విషయంలో ఆందోళన కనిపిస్తోంది. భారత్కు ఇది మరింత ప్రమాదంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: ఆటో మోషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెక్టారులో ఉద్యోగాల విషయంలో ఆందోళన కనిపిస్తోంది. భారత్కు ఇది మరింత ప్రమాదంగా కనిపిస్తోంది.
ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు యాంత్రీకరణ పెరిగిపోతూ, సరికొత్త డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తుండగా.. ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకో చూస్తున్నాయి.
మారుతున్న సాంకేతికతకు బదలాయింపులో భాగంగా ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఐటీ కంపెనీలకు క్లిష్టతరంగా మారిందని నాస్కామ్ అంచనా వేస్తూ.. భారత ఐటీ రంగంలో 15 లక్షల మంది ఉద్యోగులు మరోసారి శిక్షణ తీసుకుంటేనే విధులు నిర్వహించగలిగే పరిస్థితి ఉందని, అంతకన్నా, వీరిని తొలగించడమే మేలని కంపెనీలు భావిస్తున్నాయని పేర్కొంది.
ఇందులో భాగంగా ముప్పై నుంచి ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన టెక్నాలజీ నిపుణులను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు దాదాపు అన్ని కంపెనీల్లో జరుగుతున్నాయని పేర్కొంది.
యంత్రాలు వచ్చేశాయి
సాధారణంగా ఐటీ కంపెనీల్లో ప్రధాన బాధ్యతలను పదేళ్లకు పైగా అనుభవమున్న ఉద్యోగులకు కేటాయిస్తారు. ఇప్పుడు వీరి పనులను చేయడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త టూల్
ఉదాహరణకు.. క్యాప్ జెమినీ సంస్థ వివిధ ప్రాజెక్టులను కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించి, వారెలా విధులను నిర్వహిస్తున్నారో పర్యవేక్షించేందుకు ఐబీఎం తయారు చేసిన కాగ్నిటివ్ కన్సల్టింగ్ టూల్ వాట్సన్ను వాడుతోంది. అంటే వాట్సన్ టూల్, ఓ టీమ్ లీడర్ బాధ్యతలను నిర్వహిస్తోంది.
కొత్త యంత్రం
ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ల పనుల పర్యవేక్షణకు స్వయంగా ఓ యంత్రాన్ని తయారు చేసుకుంది. ఐటీ సంస్థల్లో 60 నుంచి 65 శాతం మంది ఉద్యోగులు ట్రెయిన్ కాలేదని, వీరికి శిక్షణ అత్యవసరమని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కందుల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
శిక్షణపై..
ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే అవకాశాలు లేవన్నారు. ఒకవేళ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తే, అందుకు కోట్ల కొద్దీ ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మానవ వనరుల విభాగం నిపుణులు భావిస్తున్నారు.