చంద్రబాబుపై 'హైదరాబాద్' ఒత్తిడి, వనజాక్షికి పోలీసు భద్రత
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాదులో ఉండి పాలించడం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి పెరుగుతోన్నట్లుగా తెలుస్తోంది. ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వేలమంది ఉద్యోగులు హైదరాబాదులో కూర్చుని పాలన సాగించడమేమిటని ఒత్తిడి పెరుగుతోందంటున్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. పలు వర్గాల నుంచి తక్షణం ఉద్యోగులను తరలించాలన్న వినతులు వస్తున్నాయని చెప్పారు. అందువల్లే, ఉద్యోగులందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించామన్నారు.
అంతకన్నా ముందు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అమరావతి ప్రాంతంలో సౌకర్యాలు లేకుండా పని చేయడం సాధ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు కృష్ణారావు ముందు అభిప్రాయపడ్డారు.
దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు, హైదరాబాదులో అందరికీ ప్రభుత్వమే వసతి, సదుపాయాలు కల్పించలేదని అన్నారు. కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుందని, వసతుల కల్పనపై ఉద్యోగులే సభ్యులుగా ఓ కమిటీని వేస్తామని చెప్పారు.
వనజాక్షికి పోలీసు భద్రత
ముసునూరు తహసీల్దారు వనజాక్షికి పోలీసు భద్రత కల్పించారు. నిన్ను చంపేందుకు సుఫారీ తీసుకున్నామని, బదలీ చేయించుకోవాలని బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించారు.
ఆమె వెంట నిత్యం ఒక కానిస్టేబుల్ ఉంటారని పోలీసులు తెలిపారు. రాత్రులు గస్తీ నిర్వహిస్తామని, ఆమె ఇంటి వద్ద అనుమానంతో సంచరించే వ్యక్తులను, ఈ కేసుపై అనుమానం ఉన్న వారిని అందర్నీ విచారిస్తామన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆమెకు రక్షణ కల్పిస్తామన్నారు. ఆ లేఖను బట్టి చుట్టుపక్కల గ్రామాల్లో నుంచే వచ్చినట్లుగా తెలుస్తోంది.