కేసీఆర్ కు బుద్ధుందా; కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? బీజేపీ భీమ్ దీక్షలో బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బిజెపి నేతలు సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసి, భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను కెసిఆర్ అవమానించారని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న బిజెపి నేతలు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా భీమ్ దీక్షలు నిర్వహించారు.
పాస్ పోర్ట్ బ్రోకర్,దుబాయ్ శేఖర్.. బూతుపురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం: డీకే అరుణ
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ భీమ్ దీక్షలు .. ఢిల్లీలో భీమ్ దీక్షలో బండి సంజయ్
బండి సంజయ్ గురువారం ఢిల్లీలో తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల మాస్కులు ధరించి మౌన దీక్ష చేశారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షను నిర్వహిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. ఇక మండల కేంద్రాల్లో నిర్వహించిన జై భీమ్ దీక్షలు ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నిర్వహించారని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భీమ్ దీక్షలో బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ తో పాటు రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా సీఎం తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ
ఢిల్లీ కేంద్రంగా బండి సంజయ్ నిర్వహించిన భీమ్ దీక్షలో బండి సంజయ్ తో పాటుగా ఎంపీ ధర్మపురి అరవింద్, వెదిరే శ్రీరామ్, పార్లమెంటు కార్యదర్శి బాలసుబ్రమణ్యం పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమ్ దీక్ష లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ తీరును తెలియజేశామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని కేంద్రాలలో బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కెసిఆర్ కు ఎందుకు ఇంత అహంకారం? బండి సంజయ్
సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కెసిఆర్ కు ఎందుకు ఇంత అహంకారం? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా అంటూ ప్రశ్నించారు. పంచ తీర్థాల పేరుతో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ అంతటి ప్రాధాన్యత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు ఇచ్చామని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ కు బుద్ధుందా అంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా అంటూ బండి సంజయ్ కేసీఆర్ తీరును నిలదీశారు. సచివాలయం వద్ద గడీలు కట్టుకోవాలని అనుకుంటున్నారా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కల్వకుంట్ల రాజ్యాంగం కోసం కేసీఆర్ యత్నాలు
కెసిఆర్ కుటుంబ పాలన గురించి ఎవరూ ప్రశ్నించ వద్దు అన్న విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని, కెసిఆర్ తెలంగాణ ద్రోహి అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కెసిఆర్ దళిత సమాజాన్ని అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కల్వకుంట్ల రాజ్యాంగం రావాలని, కెసిఆర్ తన విగ్రహాలను పెట్టించుకోవాలి అనుకుంటున్నాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. బ్రిటిష్ పాలన చూశామని, బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టాలని, నిజాం పాలన చూశామని, వీరోచితంగా పోరాడి వారిని తరిమికొట్టాలని, అదే విధంగా మిమ్మల్ని కూడా తరిమికొడతాం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఆరోజు మరెంతో దూరంలోలేదని కెసిఆర్ కు వార్నింగ్ ఇచ్చారు.