పదవి ఇచ్చింది దోచుకోవడానికా: తమిళనాడు మాజీ సీఎస్పై కేంద్రమంత్రి
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యల పైన కేంద్ర సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం నాడు తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యల పైన కేంద్ర సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం నాడు తీవ్రంగా స్పందించారు. పదవి ఇచ్చింది లూటీ చేయడానికా అని ఆయన మండిపడ్డారు.
దేశ పౌరులందరికీ చట్టం సమానంగానే వర్తిస్తుందని ఆయన అన్నారు. సీఎస్ పదవి ఇచ్చింది లూటీ చేసేందుకు కాదన్నారు. మళ్లీ ఆ అధికారాన్ని కట్టబెట్టే సమస్యే లేదన్నారు. సీఎస్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే ఆయనకు శిక్ష తప్పదన్నారు. అర్జున్ రామ్ మేఘవాల్ ఈ రోజు హైదరాబాదులోని రాజ్ భవన్లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు.
అమ్మ బతికి ఉంటే.., నేనే సిఎస్ను..: ధ్వజమెత్తిన రామ్మోహన్ రావు
కాగా, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనుమతిలేకుండానే తన నివాసంలోకి వచ్చి తుపాకీ గురిపెట్టి తనిఖీలు చేశారని ఆ రాష్ట్ర మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
తనను ఇరవై ఆరు గంటల పాటు ఇంట్లో నిర్బంధించి తన నివాసంలో సోదాలు నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి అనుమతిలేకుండా ఐటీ శాఖ అధికారులను తన నివాసంపైకి పంపి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు.
హీరో అజిత్ ఔట్, పన్నీరు మౌనం: జయలలిత బతికి ఉంటే..!
ఇప్పటికీ తానే సీఎస్నని అన్నారు. తనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. తాను దివంగత ముఖ్యమంత్రి జయలలితతో నియమితుడైన సీఎస్నని చెప్పుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.
సెర్చ్ వారెంటులో తన పేరు లేదని చెప్పారు. తన కొడుకును అన్యాయంగా ఇరికించారన్నారు. తన కోడలు ఉండగానే కొడుకున లాక్కెళ్లారన్నారు. తనను పదవి నుంచి తొలగించే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ చేశారు. దీనిపై అర్జున్ రామ్ మేఘవాల్ ఘాటుగా స్పందించారు.